మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టడి చేసేందుకు పెద్దపల్లి జిల్లా కోర్టు వినూత్నమైన తీర్పునిచ్చింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే జరిమానా లేదా జైలు శిక్ష విధించడం ఆనవాయితీ. కానీ, పెద్దపల్లి జిల్లా జడ్జి మంజుల మాత్రం మందుబాబుల ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలని భావించి, వారికి సామాజిక బాధ్యతను గుర్తు చేసే విధంగా తీర్పునిచ్చారు.
ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో నలుగురు వ్యక్తులు అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిస్తూ పోలీసులకు చిక్కారు. వీరిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి మంజుల విచారణ చేపట్టారు. నిందితుల తప్పును గమనించిన ఆమె, కేవలం నగదు జరిమానాతో వదిలేస్తే సరిపోదని భావించారు. ప్రతి ఒక్కరికీ రూ. 500 జరిమానా విధించడంతో పాటు.. రెండు రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి విధులు నిర్వహించాలని సంచలన ఆదేశాలు జారీ చేశారు.
కోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ పర్యవేక్షణలో ఈ నలుగురు మందుబాబులు రోడ్డెక్కారు. పెద్దపల్లి పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే అయ్యప్ప సెంటర్, బస్టాండ్ కూడలి, కమాన్ చౌరస్తాలలో వీరు ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పాల్గొన్నారు. ఎండను లెక్కచేయకుండా, ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు వాహనాల రాకపోకలను నియంత్రించారు.
ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తప్పు చేసిన వారికి ఇటువంటి శిక్షలు విధించడం వల్ల తాము చేసే పొరపాటు వల్ల ఇతరులకు ఎంత ఇబ్బంది కలుగుతుందో వారికి అర్థమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జైలుకు పంపడం కంటే, ఇలా సమాజానికి ఉపయోగపడే పనులు చేయించడం వల్ల బాధ్యత పెరుగుతుందని మేధావులు జడ్జి తీర్పును అభినందిస్తున్నారు. మద్యం మత్తులో వాహనం నడిపితే ప్రాణాలు పోవడమే కాకుండా, ఇలా నడిరోడ్డుపై నిలబడి పనిచేయాల్సి వస్తుందనే భయం మందుబాబుల్లో కలిగించే ప్రయత్నం ఇది.
ALSO READ: Indian Women Journey: రూ. 5 వేలతో ఉద్యోగం, ఇప్పుడు రూ. 3 కోట్ల ఇల్లు కొనేసింది.. హ్యాట్సాఫ్ హిమి!