pharmacy internship: స్వేచ్ఛ బ్యూరో: గాంధీ హాస్పిటల్లోనే ఇంటెర్న్ షిప్ కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ గుండ్ల పోచంపల్లి డివిజన్ కండ్ల కోయలోని ఫార్మసీ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్పిటల్ లోనే ఇంటర్న్ షిప్ కు అవకాశం కల్పిస్తామని కళాశాలలో ప్రవేశం తీసుకునే సమయంలో యాజమాన్యం హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ ఇప్పుడు సీఎంఆర్ వైద్య కళాశాల హాస్పిటల్లో ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారని తెలిపారు. విద్యార్థులకు సమాచారం ఇవ్వకుండా గాంధీ ఆసుపత్రితో ఒప్పందాన్ని రద్దు చేసుకొని, సీఎంఆర్ వైద్య కళాశాలతో ఎలా ఒప్పందం చేసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ హాస్పిటల్ లోనే ఇంటర్న్ షిప్ కు అవకాశం కల్పిస్తామంటేనే తాము రూ.15 లక్షలు చెల్లించి అడ్మిషన్ తీసుకున్నామని తెలిపారు. థర్డ్ ఇయర్ లో ఉండగా గాంధీ హాస్పిటల్ కు పంపి, కేసులను నోట్ చేసుకొని రమ్మని చెప్పారని, అలా అయితేనే ఆరవ సంవత్సరములో గాంధీలో ఇంటర్న్ షిప్ కు అవకాశం కల్పిస్తామని గతంలో ఉన్న ప్రిన్సిపాల్ తెలిపారని చెప్పారు.
ఇప్పుడు మాత్రం సీఎంఆర్ హాస్పిటల్లో నే పనిచేయాలని చెప్తున్నారని తెలిపారు. కాగా విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు నాగేష్ మాట్లాడుతూ ఫార్మ్ డి విద్యార్థులకు సీఎంఆర్ యాజమాన్యం అన్యాయం చేస్తుందని ఆరోపించారు. అడ్మిషన్ తీసుకునే సమయంలో ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సీఎంఆర్ ఆస్పత్రిలో అన్ని కేసులు లేవని, ఇక్కడ ఇంటర్న్ షిప్ చేస్తే విద్యార్థులకు ప్రయోజనం ఏమి ఉండదని తెలిపారు. అసలు ఫార్ము డీ విద్యార్థులు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందులను అధ్యయనం చేయాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ వారిని ఆసుపత్రి సిబ్బంది గా వాడుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థులకు అన్యాయం చేస్తున్న కళాశాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: నాడు చేసిన పాపానికి నేడు కర్మ అనుభవిస్తున్నా – మంగ్లీ
నిబంధనల ప్రకారమే సిఎంఆర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఫార్మ్ డి విద్యార్థుల ఇంటర్న్ షిప్ కు ఒప్పందం చేసుకున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. నిబంధన ప్రకారం కళాశాల ఉన్న మున్సిపాలిటీ పరిధిలో 300 బెడ్ల ఆస్పత్రి ఉంటే ఒప్పందం చేసుకోవచ్చని, సిఎంఆర్ లో అని విభాగాలకు కలిపి 700 బెడ్లు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రకారం తాము సీఎంఆర్తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా సిఎంఆర్ వైద్య కళాశాల ఆస్పత్రి కళాశాలకు దగ్గరగా ఉండి, విద్యార్థులు మరింత సౌకర్యంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి, అధికారికంగా ఉత్తర్వులు కూడా పొందామని చెప్పారు.