Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ సిటీకి రానున్నారు. దాదాపు మూడు గంటలపాటు నగరంలో ఆయన ఉండనున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్స్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు. ఆధివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు సిటీ అధికారులు.
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నగరంలో ప్రధాని పర్యటన
నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భాగ్యనగరానికి వస్తున్నారు. బెంగుళూరు నుంచి నేరుగా హైదరాబాద్ నగరానికి మధ్యాహ్నం రానున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి మాదాపూర్లో హెచ్ఐసీసీకి వెళతారు. అక్కడ వివిధ ప్రాజెక్టులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, పలువురు కేంద్రమంత్రులు హాజరవుతున్నాయి.
అక్కడి నుంచి నేరుగా గచ్చిబౌలిలోని సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్లోని సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ల్యాండ్స్, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, NFCL జంక్షన్, SNT జంక్షన్, సాగర్ సొసైటీ, NTR భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ తల్లి ఖమాన్, నీరూస్ జంక్షన్, సైబర్ టవర్స్ జంక్షన్, శిల్పారామం, హైటెక్స్ ఖమాన్, NAC మెయిన్ గేట్, HICC చెక్ పోస్ట్, VVIP అలైటింగ్ పాయింట్ ఉన్నాయి. మళ్లీ అదే మార్గంలో నేతలు తిరిగి ప్రయాణం కానున్నారు.
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన సిటీ పోలీసులు
దీనికితోడు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం సాయంత్రం బీజేపీ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మే 10న ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
బేగంపేట నుంచి సంగీత్ జంక్షన్, పారడైజ్–పాట్నీ, క్లాక్టవర్–సంగీత్ మార్గాన్ని వినియోగించాలని పోలీసులు సూచించారు. అదే విధంగా సంగీత్ నుంచి బేగంపేట వైపు వచ్చే వాహనాలకు ఇదే మార్గంలో అనుమతించనున్నారు. బేగంపేట నుంచి తిరుమలగిరి వెళ్లే వాహనాలు.. సెయింట్ జాన్స్ రోటరీ, షెనాయ్ నర్సింగ్ హోం, ఏఓసీ సెంటర్, కేవీ–తిరుమలగిరి మార్గంలో వెళ్లాలని సూచన చేశారు ట్రాఫిక్ పోలీసులు.
ALSO READ: ప్రధాని హైదరాబాద్ టూర్.. చంద్రబాబు-పవన్ ఇంటికి వెళ్లనున్న ప్రధాని మోదీ
బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనదారులు.. బాలానగర్ జంక్షన్, ఫతేనగర్, అమీర్పేట్, పంజాగుట్ట, బేగంపేట మార్గం వైపు మళ్లించనున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా పంజాగుట్ట, బేగంపేట, రసూల్పురా జంక్షన్, మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్ మార్గాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లాలనుకునే ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోవడానికి ముందస్తుగా బయలు దేరాలని కోరారు. నగరవాసులు వీలైనంత వరకు మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 2 వేల మంది సిబ్బందిని బందోబస్తు కోసం మోహరించినట్లు కమిషనర్ సుమతి తెలిపారు. అనుమతి లేని వ్యక్తులను పరిమిత ప్రాంతాల్లోకి అనుమతించబోమని, సభా ప్రాంగణానికి చేరుకునే రహదారులు, వాహనాల తనిఖీ కేంద్రాలు, పార్కింగ్ ప్రాంతాలన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని స్పష్టం చేశారు.