PM Modi telangana tour updates(BJP news in telangana): తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది. ఎన్నికల్లో ఈసారి ఎక్కువ సీట్లు గెలుపొందాలని భారీ స్కెచ్ చేసింది. ఎన్నికల పోలింగ్కు కేవలం 11 రోజులు మాత్రమే ఉండడంతో తెలంగాణలో ఆ పార్టీ ముఖ్యనేతల తాకిడి క్రమంగా పెరుగుతోంది. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం మెదక్ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో సీఎం రేవంత్రెడ్డి సహా నలుగురికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరుసటి రోజు మంగళవారం ప్రధాని మోదీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్పై ఆయన విమర్శలు గుప్పించే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు ప్రధాని నరేంద్రమోదీ.
మహారాష్ట్రలోని లాతూరు నేరుగా సాయంత్రం నాలుగున్నరకు సభ జరిగే ప్రాంతానికి హెలికాప్టర్లో ప్రధాని మోదీ చేరుకోనున్నారు. దాదాపు 30 ఎకరాల్లో ఈ సభకు ఏర్పాట్లు జరిగాయి. దాదాపు 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ అనంతరం ఐదున్నర గంటల సమయంలో జహీరాబాద్ నుంచి దుండిగల్ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. ఇదికాకుండా మే నెల ఎనిమిది, తొమ్మది తేదీల్లో తెలంగాణ పర్యటనకు రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 8న వేములవాడలో బహిరంగ సభ హాజరవుతారని సమాచారం.
ALSO READ: హైదరాబాద్లో డబ్బే డబ్బు, ఒక్క రోజే రెండు కోట్లు సీజ్
మరోవైపు మే ఒకటిన అంటే బుధవారం (రేపు) కేంద్ర హోంమత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. కీలక నేతలతో భేటీ తర్వాత హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాదవీలతకు మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. గౌలిపుర, లాల్దర్వాజా, శాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో సాగనుంది. ఐదున సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గాల రోడ్ షోలకు ఆయన హాజరుకానన్నారు. మొత్తానికి ఎన్నికలకు కేవలం తక్కువ వ్యవధి ఉండడంతో బీజేపీ అగ్రనేతల తాకిడి తెలంగాణలో పెరగనుంది.