POCSO Cases: స్వేచ్చ బ్యూరో: కఠినమైన చట్టాలున్నాయి.. శిక్షలు అంతే కఠినంగా పడుతున్నాయి.. అయినా, మృగాళ్లలో మాత్రం మార్పు రావటం లేదు. నిండా పదేళ్లు కూడా లేని పసి పిల్లలపై అఘాత్యాలకు పాల్పడుతున్నారు. ఆందోళనాకరమైన అంశం ఏమిటంటే కొందరు తమ వికృత వాంఛలకు బాలురను కూడా బలి చేస్తుండటం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రతిరోజూ పోక్సో చట్టం ప్రకారం 5నుంచి 8కేసులు నమోదవుతున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటంటే 99శాతం కేసుల్లో నిందితులు బాధితులకు బాగా తెలిసిన వారే కావటం. కొంతమంది మైనర్ బాలురు కూడా ఇలాంటి దారుణాలకు ఒడిగడుతుండటం.
ఆరు నుంచి పన్నెండేళ్లు.. పాపం పుణ్యం తెలియని వయసు. కాస్త ప్రేమగా మాట్లాడినా ఆ వయసు పిల్లలు ఇట్టే దగ్గరైపోతారు. సరిగ్గా దీనినే అవకాశంగా చేసుకుంటున్నారు కొందరు కామాంధులు. తియ్యటి మాటలు చెబుతూ.. చిన్న చిన్న గిఫ్టులు ఇస్తూ చిన్నారులను ఉచ్చులోకి లాగుతున్నారు. అవకాశం చూసుకొని అఘాత్యాలకి పాల్పడుతున్నారు. ఇలాంటి వారిలో పక్కింట్లో ఉండే అంకుల్స్ స్కూళ్లలో ఉండే టీచర్లు ట్యూషన్ మాస్టర్లు ఉంటున్నారు. దారుణం ఏందంటే కొన్నిసార్లు జన్మనిచ్చిన తండ్రులు.. సవతి తండ్రులు.. తొడబుట్టినవారు దగ్గరి బంధువులు సైతం ఇలాంటి అకృత్యాలకు ఒడిగడుతుండటం.
కొన్ని ఉదంతాల్లో మైనారిటీ తీరని బాలురు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. దీనిపై పోలీస్ అధికారులతో మాట్లాడగా అరచేతిలోకి వచ్చేసిన స్మార్ట్ ఫోన్లే దీనికి ప్రధాన కారణం అని చెప్పారు. తెలిసీ తెలియని వయసులో చాలామంది పిల్లలు ఫోన్లలో పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటు పడుతున్నారని తెలిపారు. వాటి ప్రభావంతో నేరాలు చేస్తున్నట్టు వివరించారు.హయత్ నగర్ స్టేషన్ పరిధిలో కొంతకాలం క్రితం జరిగిన సంఘటన ఇది నిజమని నిరూపిస్తోంది. పదవ తరగతి చదువుతున్న నలుగురు పిల్లలు పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటు పడి తమతోపాటే చదువుకుంటున్న ఓ మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం జరిపారు. పైగా, ఈ అకృత్యాన్ని వీడియో తీశారు. అది బయట పడటంతో కేసులు నమోదు చేసిన పోలీసులు నలుగురు బాలురను అరెస్ట్ చేశారు.
Also Read: Nizamabad: సెలైన్లో హార్పిక్ కలిపి.. భర్తను లేపేసిన భార్య..!
పసి పిల్లలపై జరుగుతున్న ఈ దారుణాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లో పోక్సో చట్టాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం నమోదయ్యే కేసుల్లో విచారణను త్వరితగతంగా పూర్తి చెయ్యటానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటయ్యాయి. దాదాపు తొంభై శాతానికి పైగా కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. నేర తీవ్రతను బట్టి న్యాయస్థానాలు 5నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్షలు వేస్తున్నాయి. కొన్ని కేసుల్లో నిందితులకు మరణ శిక్ష కూడా అమలు చేశారు. అయినా, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగి పోతూనే ఉన్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2025 జూన్ నుండి 2026 ఏప్రిల్ మధ్య కేవలం 11 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో పోక్సో చట్టం ప్రకారం 2,799కేసులు నమోదు కావటం పరిస్థితికి దర్పణం పడుతోంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే 99శాతం కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసినవారే కావటం. నమోదైన కేసుల్లో దాదాపు 40% మంది బాధితులు ఆన్లైన్ మాధ్యమాలు లేదా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా టార్గెట్ గా మారటం. ఇక, బాధితుల్లో 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలు ఎక్కువగా ఉండటం.
ఇలాంటి దారుణాలకు చెక్ పెట్టాలంటే ఇంట్లో తల్లిదండ్రులు.. స్కూళ్లలో టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అయిదేళ్ల వయసు నుంచే ఇటు ఇంట్లో అటు స్కూళ్లలో బ్యాడ్ టచ్.. గుడ్ టచ్ పై పిల్లల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. అపరిచిత వ్యక్తులతో తీసుకోవాల్సిన జాగత్తల గురించి చెప్పాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రతిరోజు కనీసం గంటసేపు పిల్లలతో మాట్లాడాలని సూచించారు. ఆ రోజు ఎలా గడిచింది? ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? అన్న విషయాలు తెలుసుకోవాలని చెప్పారు.
Also read: భారీ వర్షాలకు మహారాష్ట్ర అతులాకుతలం.. విరిగిన కొండచరియలు, ముంబై-పుణే మధ్య వాహనాలు నిలిపివేత
ఎలాంటి సమస్య గురించైనా పిల్లలు ధైర్యంగా తమతో చెప్పుకొనే పరిస్థితి కల్పించాలన్నారు. ఇక, మగపిల్లలు ఉపయోగించే మొబైల్ ఫోన్లపై కన్నేసి పెట్టాలని చెప్పారు. రోజులో ఎంతసేపు సెల్ ఫోన్ చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? అన్నది ఎప్పటికప్పుడు చెక్ చెయ్యాలన్నారు. స్క్రీన్ టైంపై పరిమితులు పెట్టాలన్నారు. దాంతోపాటు పోర్న్ సైట్లను యాక్సెస్ చెయ్యకుండా ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్లి వాటిని బ్లాక్ చెయ్యాలని చెప్పారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు నైతిక విలువలను నేర్పించాలని సూచించారు.
Also read: CM Protocol: సీఎం రేవంత్ సభల్లో కొత్త రూల్స్.. ఇకపై ఆ హడావుడి చేస్తే వేదికపైకి నో ఎంట్రీ..?