Tender Scam: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ (సివిల్ సప్లయిస్) చుట్టూ ఇప్పుడు అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు పంపిణీ చేసే సన్నరకం ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో తెరవెనుక సిండికేటు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టెండర్ల ఈ ప్రక్రియను కొందరు అధికారులు, రైస్ మిల్లర్లు కలిసి పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన సన్నరకం ధాన్యపు టెండర్ల పర్వం సివిల్ సప్లయిస్ శాఖలో జరుగుతున్న అంతర్గత లొసుగులను బట్టబయలు చేస్తోందని సమాచారం. సన్నరకం ధాన్యానికి టెండర్లు పిలిచినప్పటి నుంచి… వాటిని రద్దు చేసే వరకు జరిగిన పరిణామాలు పౌరసరఫరాల శాఖ అంతర్గత తీరును, పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సన్నరకం ధాన్యాన్ని సేకరించేందుకు పౌరసరఫరాల సంస్థ టెండర్లను ఆహ్వానించింది. గత నెల 20న గ్లోబల్ ఈ-వేలం ప్రకటన ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గల రైస్ మిల్లుల్లో నిల్వ చేసిన సన్నరకం ధాన్యం 5 లక్షల మెట్రిక్ టన్నుల విక్రయానికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఈ-వేలం ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. https://market.neml.in, https://www.e-krishimandi.com, https://agro.mjunction.in వెబ్ సైట్లో వివరాల కోసం సంప్రదించాలని సూచించింది. అధికారులు సైతం మూడు ప్లాట్ ఫాంల ద్వారా టెండర్లను ఆహ్వానించినట్లు పేర్కొంటున్నారు. అయితే ఈ నోటిఫికేషన్కు మిల్లర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. విచిత్రమేమిటంటే… అసలు ఈ టెండర్లలో ఎంతమంది మిల్లర్లు పాల్గొన్నారు? ఎవరెవరు బిడ్లు వేశారనే కనీస సమాచారం కూడా శాఖలోని ఉన్నతాధికారులకు తెలియకపోవడం గమనార్హం. సాంకేతిక కారణాలో లేక అంతర్గత ఒప్పందాలో తెలియదు కానీ, సమాచారాన్ని గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2025-26 వానాకాలానికి సంబంధించిన 5లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని సివిల్ సప్లయి కార్పొరేషన్ నిర్ణయించడంతో పాటు క్విటా కనీస ధరను రూ.3405 పే నిర్ణయించింది. అయితేటెండర్లలో నిబంధనల ప్రకారం నిర్దేశిత ధర కంటే తక్కువ కోట్ చేశారంటూ అధికారులు అప్పటికప్పుడు ఈ టెండర్లను రద్దు చేసేశారు. ఎంతమంది వేశారో తెలియనప్పుడు, రేట్లు తక్కువగా వచ్చాయని అధికారులు ఎలా నిర్ధారణకు వచ్చారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. దీని వెనుక పెద్ద ‘సిండికేట్’ రాజకీయం నడిచిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Also read: కేఏ పాల్ ను మైమరపించేలా! పాలిటిక్స్లో పేలుతున్న సినిమా పంచులు.. ! వెటకారపు వెక్కిరింపులు..
మార్కెట్లో సన్నరకం ధాన్యానికి ఉన్న డిమాండ్ను బట్టి ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టేందుకు కొందరు మిల్లర్లు సిండికేట్గా మారినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి లాభం చేకూరేలా కాకుండా, తాము అనుకున్న ధరకే టెండర్లు దక్కించుకోవాలని, లేదా ప్రక్రియను నీరుగార్చాలని ఈ సిండికేట్ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పౌరసరఫరాల శాఖలోని కొందరు కీలక అధికారులు మిల్లర్లకు లోపాయికారీగా సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలు ఉండబట్టే మిల్లర్లు ఇంతలా తెగబడుతున్నారనే చర్చ నడుస్తోంది.
తక్కువ కోడ్ టెండర్ ను రద్దు చేసిన అధికారులు… ఇప్పుడు మున్ముందు ఏం చేయబోతున్నారు? సన్నరకం ధాన్యం సేకరణ కోసం పారదర్శకంగా మళ్లీ కొత్త టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తారా? లేక కాలయాపన చేసి, సమయం లేదనే నెపంతో పాత మిల్లర్లకే ‘నామినేషన్’ పద్ధతినో లేదా వేరే మార్గంలోనో కట్టబెట్టి ‘మమ’ అనిపిస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతూ, ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న ఈ ‘సిండికేట్’ గుట్టును ప్రభుత్వం తేలుస్తుందో లేదో చూడాలి.
సివిల్ సప్లయి శాఖపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. సీఎంఆర్ బియ్యంను తీసుకోవడంలో ఆలస్యం, నిర్ణీత సమయంలో ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకోకపోవడం, మిల్లులపై తనికీ సమయంలో కొంతమంది అధికారులే వారికి ముందస్తు సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు విజిలెన్స్ తనిఖీల్లో మిల్లుల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చినా నెలల తరబడి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్లపై ఎలా ముందుకు పోతుంది.. వచ్చే వానాకాలం సీజన్ నాటికి రైస్ మిల్లుల్లో, గోదాముల్లో స్టాక్ లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also read: Nizamabad: సెలైన్లో హార్పిక్ కలిపి.. భర్తను లేపేసిన భార్య..!