CM Protocol: స్వేచ్చ బ్యూరో: ముఖ్యమంత్రి అధికారిక పర్యటనలు, బహిరంగ సభల నిర్వహణలో ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇటీవల సీఎం సభల్లో చోటుచేసుకున్న వరుస వివాదాలు, భద్రతా లోపాలు, మరియు సమన్వయ లోపం వంటి పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు.. సరికొత్త నిబంధనలను తెరపైకి తెచ్చారు. సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, సభల నిర్వహణను మరింత క్రమబద్ధం చేసేందుకు వీలుగా సరికొత్త “ప్రోటోకాల్”ను ఖరారు చేశారు. ఇప్పటివరకు సీఎం పర్యటనల్లో స్థానిక నేతలు, వారి అనుచరులు, భారీ దండలు, శాలువాలతో వేదికలపైకి ‘జంబో టీమ్స్’గా దూసుకురావడం సర్వసాధారణంగా మారింది. అయితే, ఇకపై ఇలాంటి భారీ బృందాలకు వేదికపైకి ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు మాత్రమే స్టేజ్ పైకి అనుమతి ఉంటుంది. అది కూడా ముందుగా ఖరారు చేసిన జాబితా ప్రకారమే జరగాలి.అయితే శాలువాలు, పూలదండల పేరిట సీఎం చుట్టూ గుంపులుగా చేరి హడావుడి చేసే సంస్కృతికి స్వస్తి పలకనున్నారు.
Also read: AIswarya Lakshmi :హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఏం చదివిందో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..
సీఎం భద్రతా విభాగానికి సంబంధించి కూడా నిబంధనలను కఠినతరం చేశారు. ముఖ్యమంత్రితో పాటు వెళ్లే పర్సనల్ స్టాఫ్, స్థానిక పర్యటనల్లో డ్యూటీలో ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఖచ్చితంగా అధికారిక పాస్లు కలిగి ఉండాలి. పాస్ లేనిదే ఎంతటి వారినైనా సరే.. అంతర్గత వలయం లోకి అనుమతించబోరని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.ఇటీవలి కాలంలో సీఎం పాల్గొన్న కొన్ని కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదాలు, భద్రతా వలయాన్ని దాటుకుని కొందరు నేరుగా సీఎం వద్దకు రావడం, స్టేజ్ మేనేజ్మెంట్లో లోపాలు వెలుగుచూశాయి. ఇవన్నీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా మారడంతో, ఇంటెలిజెన్స్ , పోలీస్ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. స్థానిక జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖలు సీఎం సభల నిర్వహణ జాబితాను పక్కాగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి స్టేజ్ ఎక్కేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మార్పుల ద్వారా సీఎం సభల్లో గందరగోళానికి తెరపడటమే కాకుండా, భద్రత మరింత పటిష్టం కానుందని అధికారులు భావిస్తున్నారు.
Also Read: నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సినిమా.. కానీ 2 రోజులకే తొలగింపు?