Thorrur Municipality: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144,163 సెక్షన్లు కఠినంగా అమలు చేస్తూ పట్టణమంతా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తూ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ రంగంలోకి దిగి ప్రతి కీలక ప్రాంతాన్ని తనిఖీ చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 9 మంది, కాంగ్రెస్కు 7 మంది కౌన్సిలర్లు గెలవడంతో ప్రారంభమైన ఆధిపత్య పోరు, తరువాత ప్రజాప్రతినిధుల ఓట్లతో సమీకరణాలు మారి ఇరు పార్టీల బలం 9–9గా సమానమవడంతో రాజకీయంగా పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ క్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొనడం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. మున్సిపల్ కార్యాలయం వద్ద కార్యకర్తలు గుమిగూడే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు కట్టడి చేయగా, ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాల దృష్ట్యా అధికారులు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు.
Also Read: Cyber Crime: డేంజర్ బెల్స్.. మరో కొత్త రకం మొసానికి తెరలేపిన సైబర్ కేటుగాళ్లు
పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బారిగేట్లు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తూ ఎన్నికలను పూర్తిగా శాంతియుత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు. ఒక చిన్న పట్టణం చుట్టూ ఇంతటి భద్రతా ఏర్పాట్లు కనిపించడంతో స్థానిక ప్రజల్లో ఆందోళనతో పాటు ఆసక్తి కూడా పెరిగింది; తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయోనన్న ఉత్కంఠ నెలకొనగా, రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి ఇప్పుడు తొర్రూరుపైనే ఉంది.