Nepali Gangs: స్వేచ్ఛ బ్యూరో: ఇంట్లో నేపాలీలను పనిలో పెట్టుకుంటున్నారా.. అయితే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. నేపాలీలు వరుసగా చేస్తున్న దోపిడీలు.. దొంగతనాల నేపథ్యంలో పోలీసులు చేస్తున్న హెచ్చరిక ఇది. నమ్మకంగా పనిలో చేరి ఉన్నదంతా దోచుకునే నేపాలీలను పట్టుకోవటం దాదాపుగా అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి వాళ్లు స్వదేశానికి చేరుకున్నారంటే అంతే సంగతులని అంటున్నారు. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం నేరాలు చేయటమే వృత్తిగా పెట్టుకున్న నేపాలీలు కొందరు గ్యాంగులుగా ఏర్పడి దోపిడీలు.. దొంగతనాలు చేస్తున్నారు. ఒక్కో గ్యాంగులో 8 నుంచి 12మంది సభ్యులుగా ఉంటారు. వీరిలో ఒకరిద్దరు పెళ్లయిన వారు ఉంటారు. ఆ తరువాత మన దేశంలోని వేర్వేరు మెట్రోపాలిటన్ సిటీలకు చేరుకుంటారు. ఇక్కడకు వచ్చిన తరువాత వేర్వేరుగా విడిపోతారు. సంపన్నుల ఇండ్లను ఎంపిక చేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. భర్త వాచ్ మెన్ గా చేరితే భార్య ఇంట్లో పనికి కుదురుతుంది. ఆ తరువాత కష్టపడి పని చేసి యజమానుల నమ్మకాన్ని సంపాదిస్తారు.ఈ క్రమంలో ఇంట్లో నగలు, నగదు ఎక్కడెక్కడ దాచి పెడుతున్నారన్నది తెలుసుకుంటారు. అవకాశం రాగానే సహచరులను పిలిపించుకుని ఉన్నదంతా ఊడ్చుకెళుతున్నారు. ఇటీవల కార్ఖానా స్టేషన్ పరిధిలోని గన్ రాక్ ఎన్ క్లేవ్ లో సరిగ్గా ఇదే జరిగింది.
ఆర్మీలో కల్నల్ గా పని చేసి రిటైరైన గిరి ఇంట్లో పనికి చేరిన నేపాలీ దంపతులు రాజ్ బహదూర్, రేఖాదేవి కలిసి శనివారం రాత్రి నలుగురు సహచరులను పిలిపించుకుని 50లక్షలకు పైగా సొత్తును దోచుకుని పరారయ్యారు. తాజాగా జూబ్లీహిల్స్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో పనిలో చేరిన భార్యాభర్తలు మహేశ్ సాయి, అప్సర 2 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలను దొంగిలించి ఉడాయించారు. అయితే, నేపాలీ గ్యాంగులు ఇలా దోపిడీలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూకట్ పల్లి వివేకానందనగర్ వాస్తవ్యుడు, వ్యాపారి అయిన దామోదర్ రావు ఇంట్లో నేపాల్ దేశానికి చెందిన భార్యాభర్తలు చక్రధర్, సీత మూడేళ్ల కుమారునితో కలిసి పనిలో చేరారు. ఆ తరువాత తమ బంధువు అంటూ ఓ వ్యక్తిని తీసుకొచ్చి తమకిచ్చిన గదిలోనే ఆశ్రయం కల్పించారు. ఆ తరువాత యజమాని కుటుంబ సభ్యులు ఓ విందు కోసం బయటకు వెళ్లగా ఇంట్లో ఉన్న 30లక్షల నగదు, 25లక్షల విలువ చేసే బంగారు నగలను దోచుకుని పరారయ్యారు. సైనిక్ పురిలో నర్సింహారెడ్డి అనే వ్యాపారి ఇంటి నుంచి కూడా నేపాలీలు ఇదే తరహాలో లక్షల విలువ చేసే సొత్తును కొల్లగొట్టారు. ఇలా చెబుతూ పోతే పదుల సంఖ్యలో ఉదంతాలున్నాయి.
Also Read: BRS Party: స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్..!
దోపిడీలు…దొంగతనాలు చేసి పరారవుతున్న నేపాలీలను పట్టుకోవటం కష్టమే అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలో వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్న నేపాలీలను పట్టుకోవటానికి ఆపరేషన్ నేపాల్ అని ప్రత్యేకంగా దర్యాప్తు జరిపారు. దీంట్లో పలు సంచలన వివరాలు వెలుగు చూశాయి. నేరం చేసిన తరువాత వీలైనంత తక్కువ సమయంలో ఈ ముఠాలు స్వదేశానికి చేరుకుంటాయి. దొంగిలించిన సొత్తును నేపాల్ లోనే తక్కువ రేటుకు అమ్మకుంటారు. వచ్చిన డబ్బుతో ఆస్తులు కూడబెట్టుకుంటారు. జల్సా జీవితం గడుపుతారు. ఇక, ఈ గ్యాంగుల్లో ఉండే చాలామంది సభ్యులకు రెండేసి ఇండ్లు ఉంటాయి. ఓ ఇల్లు మైదాన ప్రాంతంలో ఉంటే మరో ఇల్లు గుట్టలపై ఉంటుంది. పోలీసులు వచ్చారని తెలియగానే మైదాన ప్రాంతాలను వీడి గుట్టలపై ఉండే ఇండ్లకు చేరకుంటారు. అక్కడి నుంచి పోలీసుల కదలికలపై కన్నేసి పెడతారు. పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ఆధునిక సాంకేతికను కూడా ఉపయోగించుకుంటారు. రిటైర్డ్ కల్నల్ గిరి ఇంట్లో దోపిడీ జరిపిన 13మంది సభ్యుల గ్యాంగ్ సొత్తును పంచుకుని నాలుగు బృందాలుగా విడిపోయి ఒక్కో దారిలో ఇక్కడి నుంచి ప్రయాణమయ్యారు. మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసి పెట్టారు. మూడు నాలుగు గంటలకొకసారి ఫేస్ బుక్, మెసెంజర్ యాప్ ల ద్వారా మాత్రమే మంతనాలు జరిపారు. పోలీసులు లొకేషన్ గుర్తించకుండా వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ రౌటర్లను వినియోగించారు. అతి కష్టం మీద ఈ గ్యాంగ్ లోని అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. మిగితా నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.
ఎన్నిసార్లు హెచ్చరించినా చాలా మంది ఎలాంటి వెరిఫికేషన్లు జరిపించకుండానే నేపాలీలను ఉద్యోగాల్లో పెట్టుకుంటున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీనికి కారణం కాస్త తక్కువ జీతాలకు పని చేయటానికి వాళ్లు ముందుకొస్తుండటమే అని అన్నారు. కాసిన్ని డబ్బులు మిగుల్చుకోవటానికి వీళ్లను పనిలో పెట్టుకుంటున్న కొందరు ఆ తరువాత మూల్యం చెల్లించుకుంటున్నారని చెప్పారు. ఎవరినైనా పనిలో పెట్టుకునే ముందు ఖచ్చితంగా పోలీసులతో వెరిఫికేషన్ జరిపించుకోవాలని సూచించారు.
Also Read: Pawan Kalyan: తనను మైఖెల్ జాక్సన్తో పోల్చడంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే..