Ponguleti Srinivas: స్వేచ్ఛ బ్యూరో: భవిష్యత్తులో కూడా అధికారం దక్కదనే భయంతోనే కేటీఆర్ గారు తీవ్ర నిరాశ, అసహనంలో తెలంగాణ ప్రజానీకం అసహ్యించుకునేలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమాన్ని విస్మరించి, రాజకీయ మైలేజీ కోసం మాటల దాడులకు దిగడం వారి నిస్సహాయతకు నిదర్శనమని మంత్రి విమర్శించారు.
బీజేపీతో కుమ్మక్కు..
వరంగల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రైతు సంక్షేమంపై చింత కాదు, పూర్తిగా రాజకీయ నిరాశ, ఆక్రోశానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. బీజేపీతో కుమ్మక్కై, వారిపై ఈగ వాలనివ్వకుండా కాపాడుతూ.. అన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ అసలు రాజకీయ స్వరూపాన్ని బయటపెడుతోందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన చోట రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని మండిపడ్డారు.
నిరాశతో కేటీఆర్
వరంగల్లో నిర్వహించిన సభను ‘రైతు సంగ్రామ సదస్సు’గా చెప్పడం పూర్తిగా అసత్యమని, అది అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఆక్రోశ సభ మాత్రమేనని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఆ సమావేశంలో రైతులు కాదు, కేవలం పార్టీ కార్యకర్తలే హాజరయ్యారని తెలిపారు. అధికారం కోల్పోయిన నిరాశలో కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడి, తన గౌరవాన్ని తానే దిగజార్చుకున్నారని విమర్శించారు. రైతుల ప్రాణాలతో ఆటలాడిన వారే ఇప్పుడు రైతు మిత్రులమంటూ మాట్లాడటం ప్రజలను మోసం చేయడమేనని మంత్రి స్పష్టం చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయం
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు జరిగిన అన్యాయాలను మంత్రి గుర్తు చేశారు. పంటల బీమా ఎత్తివేసి, వరదలు, వర్షాలతో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదని, అప్పుడు బీఆర్ఎస్ నాయుకులు ఎక్కడికి వెళ్లిపోయారని ప్రశ్నించారు. ధరణి పేరుతో లక్షలాది మంది రైతులను భూముల విషయంలో ఇబ్బందులకు గురిచేసి మోసం చేశారని విమర్శించారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి అప్పుల బారినుంచి బయటపడే అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. అందుకే రైతులే వారిని అధికారానికి దూరం చేశారని స్పష్టం చేశారు.
చరిత్ర సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమంలో చరిత్ర సృష్టిస్తోందని మంత్రి తెలిపారు. పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం అందిస్తున్నామని, నెలకు సగటున రూ.5,500 కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు రూ.2,533 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పోలిక చూపించారు. రెండేళ్లలోనే రైతుల కోసం రూ.1 లక్షా 5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి, రైతు భరోసా, రుణమాఫీ, బీమా వంటి పథకాలతో రైతులకు నిజమైన అండగా నిలిచామని పేర్కొన్నారు.
రైతు పేరుతో రాజకీయాలు..
రైతు పేరుతో రాజకీయాలు చేసే రోజులు ముగిశాయని, తెలంగాణ రైతులు నిజాన్ని గుర్తించి తగిన సమాధానం ఇస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని హామీలను నెరవేర్చిందన్నారు. అంతేకాకుండా డిక్లరేషన్లో లేనటువంటి వాటిని కూడా అమలు చేస్తున్నామన్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా పనిచేస్తున్నామని అన్నారు.
Also Read: అంతరిక్ష నౌకలో అనుకోని అతిథి అరాచకం… మనుషుల్ని తినే మాయా జీవుల రచ్చ