Ponnam Prabhakar: స్వేచ్ఛ బ్యూరో: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే హైదరాబాద్లో నవనిర్మాణ సభ నిర్వహించాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మాట్లాడిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సభ నిర్వహించడం అభ్యంతరకరమని అన్నారు.
తెలంగాణ ప్రజలపై విషం కక్కుతూ, కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ ప్రజల చూపుతో ఎండిపోతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన పవన్ కళ్యాణ్, ఆ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని, తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నవనిర్మాణ సభలను గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాకుండా తెలంగాణలో ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడి సమస్యలపై దృష్టి పెట్టాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోర్టుల అంశం, పెట్రోల్-డీజిల్ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి నిలదీశారు.
Also read: నేడు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రెండో విడత పనులకు శంకుస్థాపన..!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ పండుగలా జరుపుకుంటుందని పేర్కొన్న మంత్రి, తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులు, ఉద్యమకారులను గుర్తించి గౌరవించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. హీరోగా పవన్ కళ్యాణ్ను అభిమానిస్తామని, కానీ తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రాజకీయ వ్యాఖ్యలను మాత్రం సహించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Also read: Rajya Sabha: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల..!