Telangana Rains: స్వేచ్చ బ్యూరో: వేసవి తాపం, ఉక్కపోతలతో తల్లడిల్లిపోతున్న ప్రజలను శనివారం తొలకరి జల్లు పలకరించింది. హైదరాబాద్ మహానగరంలో కూడా శనివారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. సికిందరాబాద్ తో పాటు శివారు ప్రాంతాలైన నాగోల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చీకటి పడిన తర్వాత చల్లటి గాలులు వీయంతో ప్రజలు సేద తీరారు. ఈ సారి వేసవిలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు.
కానీ శనివారం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి కాస్త చల్లబడటంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. శనివారం నుంచి రానున్న వారం రోజుల పాటు హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించటంతో ఇక వేసవి తాపం, ఉక్కపోతల నుంచి ఉపశమనం లభించినట్టేనని ప్రజలు భావిస్తున్నారు. శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు 30 జిల్లాల్లో నమోదైన వర్షపాతం వివరాలను కూడా తెలంగాణ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రాంతంలో అత్యధికంగా 50.3 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు సొసైటీ వెల్లడించింది.
హైదరాబాద్ నగరంలో కూడా గోల్కొండ మండలంలోని గోల్కొండ తహశిల్దార్ ఆఫీసు ఆవరణలో 22.3 మి.మీ.లు, షేక్ పేట సీఎంటీసీ ఆవరణలో 26.5 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు సొసైటీ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా తాండూరులో 50.3 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ మండలంలో అహ్మద్ నగర్ కమ్యూనిటీ హాల్ ఆవరణలో 15.3 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, వికారాబాద్ జిల్లాలోని పరిగి ప్రాంతంలో 18 మి.మీ.ల వర్షపాతం, రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లో 12.5 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు సొసైటీ తెలిపింది.
Also read: ఖమ్మం నగరానికి నయా లుక్.. సిద్ధమైన తీగల వంతెన.. తుది మెరుగులు చూసారా..!
రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం తగ్గుతుండటంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు 46 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలను గమనిస్తే గరిష్టంగా 43.1 డిగ్రీలుగా కొమరం భీమ్ జిల్లాలోని బెజ్జూర్ లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సొసైటీ తెలిపింది. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఇంకా 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. కొమరం భీమ్, జిగిత్యాల, మంచిర్యాల్, వరంగల్, జయశంకర్, ఖమ్మం, పెద్దపల్లి, సూర్యపేట, అదిలాబాద్, హన్మకొండ, నాల్గొండ, నిర్మల్, భధ్రాధ్రి కొత్తగూడెం, మహాబూబాబాద్, ములుగు, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్, జనగాం, యాధాధ్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది.
రాష్ట్రంలో 40 డిగ్రీల కన్నా తక్కువగా ఉష్యోగ్రతలు నమోదైన 9 జిల్లాలకు సొసైటీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ తొమ్మిది జిల్లాల్లో గరిష్టంగా హైదరాబాద్ జిల్లాలోని బండ్లగూడ మండలంలోని పాతబస్తీ లోని కందికల్ గేటు ప్రాంతంలో 39.9 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా, అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలోని దుద్యాల్ ప్రాంతంలో 37.3 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదైనట్లు సొసైటీ వెల్లడించింది.
Also read: మిర్యాలగూడ బస్టాండ్లో ఏసీబీ ఉచ్చు.. దొరికిపోయిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్!