Implementation of 2 more Guarantees in TS: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పథకాలతో పాటు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనవారికి రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు జీవో జారీ చేసింది.
ఫిబ్రవరి 27న మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. చేవెళ్ల బహిరంగ సభలో ప్రారంభించాల్సిన ఈ పథకాలు సచివాలయంలోనే ప్రారంభించాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులైన మహిళలందరికీ ఈ రూ.500కే వంట గ్యాస్ పథకం అందించనున్నారు.
తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ ను వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయనున్నారు.