Kushaiguda: నగరంలో నివాస ప్రాంతాల ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార దందా గుట్టురట్టయింది. హైదరాబాద్ మహానగరంలో ఈ మధ్యకాలంలో స్పా సెంటర్లు, అపార్ట్మెంట్ల మాటున అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా పోష్ ఏరియాలు, కాలనీల్లో ఇళ్లను అద్దెకు తీసుకుంటూ, అమాయక మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ముఠాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. చంద్రశేఖర్, గుత్తల సత్యవతి అనే వ్యక్తులు కాప్రా శ్రీరాం నగర్ కాలనీ, రోడ్ నెంబర్ 3లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కుటుంబం నివాసం ఉంటోందన్న భ్రమను కల్పిస్తూ, లోపల గుట్టుగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు మంగళవారం రాత్రి ఆ ఇంటిపై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలు సత్యవతితో పాటు, అక్కడికి వచ్చిన విటుడు సంతోష్ కుమార్ను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను టార్గెట్ చేస్తున్నట్లు తేలింది. వారికి డబ్బు ఆశ చూపి హైదరాబాద్కు రప్పించి, అనంతరం బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. ఘటనా స్థలంలో ఉన్న ఒక బాధితురాలిని పోలీసులు రక్షించి, ఆమెను రెస్క్యూ హోమ్కు తరలించారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు పంపినట్లు ఎస్సై సుధాకర్ రెడ్డి తెలిపారు. కాగా, ఈ కేసులో మరో ప్రధాన నిందితుడైన చంద్రశేఖర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Crime News: అసలు మానవత్వం ఉందా..? వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం, ఆపై హత్య