Nalgonda News: స్వేచ్ఛ, బ్యూరో: జిల్లాలో రబీ సీజన్ వరి కోతలు షురూ అయ్యాయి. యూరియా కష్టాలను అధిగమించి సాగు చేపట్టిన అన్నదాతలు కోతల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ఈ యాసంగి(రబీ ) సీజన్ కు సంబంధించి డిసెంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు వారాబంది విధానంలో 81 రోజులపాటు సాగునీటిని అందించనున్నారు. అయితే బోర్ల కింద చేపట్టిన వరి తో పాటు సాగు నీటి విడుదల చేసే నాటికి నారు సిద్ధం చేసుకుని వరి సాగు చేపట్టిన రైతులు ప్రస్తుతం ధాన్యం కోత కోసి మిల్లులకు తరలిస్తున్నారు.
నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిదిలో కెనాల్స్ , లిఫ్ట్ ల ద్వారా, చెరువుల కింద, బోర్ల పరిధిలో సుమారు 5.56 లక్షల ఎకరాలు సాగయినట్లు వ్యవసాయ అధికారులు చెబుతుండ్రు. అయితే మిర్యాలగూడ, నాగార్జునసాగర్ తో పాటు ఇతర ఏరియాల్లో చేపట్టిన వరి సాగులో 70 శాతం దొడ్డువడ్లు, సన్న వడ్ల రకం 30 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే ఛాన్స్ ఉందని ఆఫీసర్లు చెప్పారు.
ప్రస్తుతం మిర్యాలగూడ రైస్ మిల్లుల పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాళ్లకు రూ. 2389, సాధారణ వరి రకం రూ. 2369 మద్ధతు ధర ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల సీజన్ ప్రారంభం వేళ కొంతమంది మిల్లర్లు ప్రస్తుతం దిగుబడి చేసిన మహేంద్ర చింట్లు (సన్న రకం )వడ్లకు రూ. 2400 నుంచి 2500 చెల్లిస్తుండటం గమనార్హం.
ధాన్యం కొనుగోళ్ల సీజన్ ప్రారంభంలో మద్దతు ధరకు మించి క్వింటాళ్లకు రూ. 30 నుంచి 100 వరకు చెల్లించే రైస్ మిల్లర్లు ధాన్యం రాక పెరిగినప్పుడు సిండికేట్ గా మారి మద్దతు ధరలో కోత విధించటం మిర్యాలగూడ సహా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అందరి మిల్లర్ల వ్యవహారం పరిపాటిగా మారింది. ఈ యాసంగి సీజన్ నుంచి అయిన అష్ట కష్టాలు పడి వరి సాగు చేపట్టిన రైతన్నకు సీజన్ చివరి వరకు మద్దతు ధర దక్కేలా అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని పలువురు రైతులు కోరుతున్నారు.