Rahul Gandhi: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ములుగు నియోజకవర్గం హాట్ టాపిక్ కాబోతోంది. మార్చి రెండో వారంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ములుగు గడ్డపై భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన కేవలం ఒక సభకే పరిమితం కాకుండా, కేంద్ర ప్రభుత్వ విధానాలపై యుద్ధం ప్రకటించే వేదికగా మారబోతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభలో ప్రధానంగా ఉపాధి హామీ పథకం రద్దు తో పాటు రాష్ట్రాలకు నిధుల కోతపై కేంద్రం అనుసరిస్తున్న తీరును రాహుల్ గాంధీ ఎండగట్టనున్నారు.గ్రామీణ పేదల బతుకుదెరువును దెబ్బతీసే చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు.కూలీల హక్కులు, కనీస వేతనంపై కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉంది. రాహుల్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు …ఇప్పటికే షెడ్యూల్ ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన మంత్రులు సైతం రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉన్నదని రాహుల్ ను ఆహ్వానించినట్లు సమాచారం.
రాహుల్ గాంధీ రాక కేవలం బహిరంగ సభ మాత్రమే కాకుండా, పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ సాధిస్తున్న వరుస విజయాల నేపథ్యంలో ముఖ్య నేతలతో రాహుల్ ‘వన్-టూ-వన్’ సమావేశాలు నిర్వహించనున్నారు.ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ఉన్న స్పందన, రాబోయే స్థానిక ఎన్నికల వ్యూహాలపై క్షేత్రస్థాయి నివేదికలను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఇక నేతల మధ్య సమన్వయం, పదేళ్ల పవర్ కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, రెండేళ్ల తర్వాత పబ్లిక్ నుంచి వస్తున్న స్పందన వంటి వాటిపై రాహుల్ డిస్కషన్ చేయనున్నట్లు తెలిసింది.
Also Read: Rajendranagar: ఘోరం.. యువకుడిని చంపి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులు.. ఎక్కడంటే?
గతంలో ములుగులో జరిగిన సభలు పార్టీకి కలిసి రావడంతో పాటు, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైంది. ఈ వేదికగా ఏ కార్యక్రమం తలపెట్టినా..సక్సెస్ అవుతుందనే ఉద్దేశ్యంతో పార్టీ ఉన్నది. అంతేగాక ఇక్కడి గిరిజన ఓటు బ్యాంకును కాపాడుకోవడం, అటవీ హక్కుల చట్టం అమలుపై స్పష్టత ఇవ్వడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.పేదల పొట్ట కొట్టేందుకు ఉపాధి హామీ పథకం లో తీసుకువస్తున్న మార్పులను ములుగు నుంచే ప్రజలకు వివరిస్తే, ఈ ఇష్యూ జనాల్లో మరింత ఇముడుతుందనే భావనలో పార్టీ ఉన్నది. ఇక మేడారం టెంపుల్ లో రాహుల్ దర్శనం చేసుకునే అవకాశం ఉన్నదని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
Also Read: Rangareddy Crime: లవ్ మ్యారేజ్లో ఇన్స్టా చిచ్చు.. ఏం జరిగిందో తెలుసా? రంగారెడ్డి జిల్లాలో దారుణం