Hyderabad News: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సోమవారం తెలంగాణకు రానున్నారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా వికారాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. తొలుత టీ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
హైదరాబాద్కు రాహుల్గాంధీ, డీసీసీ శిక్షణా కార్యక్రమాలకు హాజరు
వికారాబాద్లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో సోమవారం ఉదయం 9 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం రేవంత్రెడ్డితో కలిసి రాహుల్గాంధీ అనంతగిరికి వెళ్తారు.
తొలుత టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. వారి నుంచి పార్టీకి సంబంధించి సమాచారం సేకరిస్తారు. ఆ తర్వాత కొత్తగా నియమితులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి హాజరవుతారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేస్తారు.
డీసీసీ అధ్యక్షులతో రాహుల్గాంధీ భేటీ, రాజ్యసభ సీటుపై కూడా
రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన కొన్ని విషయాలపై ఆయన చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీసీసీ అధ్యక్షులతోపాటు వారి కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడనున్నారు రాహుల్గాంధీ. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎజెండాను ప్రజలకు మరింత చేరువ చేసే దానిపై నిర్దేశం చేస్తారు.
దీనికితోడు లొంగిపోయిన కొంతమంది అగ్ర మావోయిస్టు నేతల ఆలోచనలను అధినేతకు పార్టీ నేతలు చెప్పే అవకాశం ఉంది. AI సమ్మిట్లో నిరసన తెలిపినందుకు న్యూఢిల్లీలో అరెస్టయిన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడి కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేత చెప్పారు.
ALSO READ: ఇకపై వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. జీవో జారీ చేసిన సర్కార్!
మార్చి 16న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి రెండు స్థానాల అభ్యర్థుల పేర్ల జాబితాను రాహుల్ గాంధీ ముందు సీఎం రేవంత్రెడ్డి ఉంచే అవకాశం ఉంది. అభిషేక్ మను సింఘ్వీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి రేసులో ఉన్నట్లు ప్రధానంగా తెలుస్తోంది. వీరితోపాటు ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, వీ హనుమంతరావు, పార్టీ సీనియర్లు శ్యామ్ మోహన్, కోదండ రెడ్డి, చిన్నారెడ్డి, మధు యాస్కీ గౌడ్, షబ్బీర్ అలీ వంటి నేతలు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.