Telangana Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వ్యాపించాయి. ఒక్కో రోజు ఒక్కో ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ విషయాన్ని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక హైదరాబాద్ సిటీలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.
తెలంగాణ వ్యాప్తంగా రెయిన్ అలర్ట్.. ఆదివారం భారీ వర్షాలు
దక్షిణాదిలో రుతుపవనాలు జోరు కొనసాగుతోంది. కేవలం కేరళం, తమిళనాడు మాత్రమే కాకుండా ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా తెలంగాణవాసులకు రెయిన్ అలర్ట్. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి ఆదివారం భారీ వర్షాలు పడనున్నాయి.
తెలంగాణలోని ఉత్తర, తూర్పు మధ్య ప్రాంతంలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం, నారాయణపేట, మహబూబ్నగర్, గద్వాల్, వనపర్తిలో రానున్న రెండు గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు పడే అవకాశం
ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి వరకు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్ సిటీలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది, సాయంత్రం నుండి రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు, భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.
ALSO READ: అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెంలో భూప్రకంపనలు, రోడ్ల మీదకు ప్రజలు పరుగులు, వాతావరణంలో మార్పులు
కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు ఆర్ అండ్ బి ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. శని-ఆదివారాలంటూ సెలవులు ఏమీలేవని, అత్యవసరం అయితే తప్ప అందరు ఫీల్డ్లో ఉండాల్సిందేనన్నారు. వర్షాల నేపథ్యంలో ఇబ్బందిగా ఉండే రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతేకాదు ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
రెవెన్యూ, పోలీసులు, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ ఇతరశాఖలతో అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఒకవేళ రోడ్లు కోతకు గురైతే ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేపట్టాలన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ సెంటర్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయాలన్నారు. ఆర్ అండ్ బి డివిజన్ల వారిగా వివరాలు తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.