Khamenei Protests Hyderabad: హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానికి నిరసనగా ఓవైసీ నేతృత్వంలో నిరసన ర్యాలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలను రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇక్కడ ర్యాలీలు తీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నిజంగానే ఇరాన్ పట్ల అంతటి అభిమానం ఉంటే నేరుగా అక్కడికే వెళ్లి యుద్ధం చేయాలని ఆయన సూచించారు. “ఓవైసీకి ఇరాన్ వెళ్లాలని ఉంటే చెప్పండి.. నేనే స్వయంగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఇస్తాను” అని రాజాసింగ్ ఎద్దేవా చేశారు.
ఇరాన్ కు అనుకూలంగా ఇక్కడ రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్న వారిని వెంటనే ఆ దేశానికి పంపించేయాలని ఆయన డిమాండ్ చేశారు. మన దేశంలో ఉంటూ పరాయి దేశాధినేతల కోసం ఆందోళనలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడంపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ కు మద్దతుగా నిలిచేవారు ఇక్కడ ఉండటం కన్నా.. యుద్ధక్షేత్రానికి వెళ్లి తమ మద్దతు తెలపడమే సరైన మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.
ఖమేనీ మృతికి సంతాపంగా జమ్మూకశ్మీర్తో పాటు హైదరాబాద్, బెంగళూరు, లక్నో వంటి ప్రధాన నగరాల్లో షియా ముస్లింలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఆందోళనలపై ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
భారతదేశంలో ఉంటూ ఇరాన్ నేత కోసం వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడంపై రష్మి విస్మయం వ్యక్తం చేశారు. “భారతదేశంలో నిరసనలు చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? మీకు ఇరాన్ పట్ల అంతటి ప్రేమ ఉంటే.. ప్రధాని మోదీ గారికి నాదొక చిన్న విన్నపం. వీరందరినీ ఇరాన్ పంపించేయండి. వారు నేరుగా అక్కడికి వెళ్లి ఆ దేశం తరఫున యుద్ధం చేస్తారు” అంటూ ఘాటుగా స్పందించారు. విదేశీ వ్యవహారాల కోసం మన దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.