Rajagopalreddy : హైదరాబాద్ బంజారాహిల్స్లోని సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ సంస్థలో రాష్ట్ర జీఎస్టీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 25 బృందాలతో 150 మంది అధికారులు సోదాలు చేశారు. ఈ సంస్థకు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు ప్రసాద్ నేతృత్వంలో సోదాలు కొనసాగాయి. బంజారాహిల్స్లోని సుశీ ఇన్ఫ్రా ప్రధాన కార్యాలయంతోపాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నాయి. మునుగోడు ఎన్నికలు సమయంలో ఈ సంస్థ నుంచి ఆర్థిక లావాదేవీలు భారీగా జరిగాయని టీఆర్ఎస్ ఆరోపించింది. లావాదేవీల సంబంధించిన పత్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. దీనిని పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఈ సంస్థకు చెందిన లావాదేవీలుగానే తేల్చింది. ఈ నేపథ్యంలో సుశీ ఇన్ ఫ్రాపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
మరోవైపు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మునుగోడులో గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో ఆయనను తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. ఉద్రిక్తత నడుమ రాజగోపాల్రెడ్డిని పోలీస్ స్టేషన్ తరలించారు.
అటు గెలుపు తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి వచ్చారు. చండూరులో టీఆర్ఎస్ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. చౌటుప్పల్లో భారీ స్వాగత కార్యక్రమంతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపఎన్నిక సందర్భంగా నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు తాత్సారం చేస్తోందని రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. దీంతో మునుగోడులో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది.