Swetcha Effect: హుజూరాబాద్లోని ఆర్ అండ్ బీ (రోడ్లు, భవనాల శాఖ) సబ్ డివిజన్ కార్యాలయంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై ‘స్వేచ్ఛ’ పత్రికలో ప్రచురితమైన కథనం అధికారుల్లో చలనం తెచ్చింది. పది నెలలుగా సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, విధులకు గైర్హాజరవుతున్న వైనంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.
కార్యాలయంలో డిప్యూటీ ఈఈ, ఏఈలు, అసిస్టెంట్లు కలిపి మొత్తం 11 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా, బుధవారం నాడు ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు గానూ వారందరికీ వివరణ కోరుతూ తక్షణమే మెమోలు జారీ చేశారు.
బయోమెట్రిక్ హాజరు, సీసీ కెమెరాలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని సిబ్బంది విధులకు ఎగనామం పెడుతున్నారని గుర్తించిన అధికారులు, వెంటనే కార్యాలయంలో డిజిటల్ హాజరు విధానాన్ని పునరుద్ధరించాలని ఆదేశించారు. పర్యవేక్షణ లోపం లేకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
దూర ప్రాంతాల నుండి వచ్చి పనులు కాక ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజల పక్షాన నిలబడి వార్తను ప్రచురించిన ‘స్వేచ్ఛ’ పత్రికపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికారుల స్పందనతో ఇకనైనా కార్యాలయం సక్రమంగా నడుస్తుందని ఆశిస్తున్నారు.
Also Read: Cyber Crime: ప్రేమ పేరుతో వల.. క్రిప్టో పేరుతో విలన్.. అంతర్జాతీయ సైబర్ నేరస్థుడు అరెస్ట్