
Raj Bhavan: రాజ్ భవన్ కీలక నేతల భేటీకి వేదికగా నిలిచింది. ఎప్పటిలానే సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు రాకుండా డుమ్మా కొట్టారు. ప్రభుత్వం తరఫున పలువురు మంత్రులు, సీఎస్ హాజరై.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. అయితే, రాజ్ భవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీటీడీపీ ప్రెసిడెంట్ కాసాని.. సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
రేవంత్ రెడ్డి పలువురు తెలంగాణ మంత్రులను పలకరించారు. మాట్లాడితే ఎక్కడ కేసీఆర్ ఆగ్రహానికి గురవుతామోననే భయం ఆ మంత్రుల ముఖంలో స్పష్టంగా కనిపించింది. రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి మాట్లాడినా.. ముభావంగా ముఖం పెట్టారు మంత్రులు.
ఆ తర్వాత సీన్ మరింత రక్తి కట్టింది. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చాలా సేపు పక్కపక్కనే కలిసి ఉన్నారు. వారిద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. తెలంగాణలో హోరాహోరీ రాజకీయం నడుస్తున్న సమయంలో.. రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు ఇలా మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై చర్చ మొదలైంది. అంతకుముందు హకీంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్.. రాష్ట్రపతికి బండి సంజయ్ ను పరిచయం చేయాలని చూసినా.. సంజయ్ మాత్రం కేసీఆర్ ముఖం కూడా చూడకుండా నేరుగా రాష్ట్రపతిని కలిసి వెళ్లిపోయారు. అలాంటిది.. రాజ్ భవన్ లో మాత్రం రేవంత్ రెడ్డితో బండి సంజయ్ ముచ్చట్లు పెట్టడం ఇంట్రెస్టింగ్ పాయింట్.
మరోవైపు, టీటీడీపీ తాజా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో సైతం టీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాసేపు ముచ్చటించడం మరో ఆసక్తికర విషయం. బండి సంజయ్ సైతం ఆ ఇద్దరితో ఏదో మాట్లాడటం.. అలా రేవంత్, సంజయ్, కాసానిల కబుర్లుపైనా గుసగుసలు మొదలయ్యాయి.
సీఎం కేసీఆర్ తో అటు రేవంత్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ.. వన్ టు వన్ బద్ద వ్యతిరేకులుగా ఉన్నారు. కానీ, శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు.. కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బకొట్టాలనే కసితో ఉన్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు.. రాజ్ భవన్ లో కలుసుకోవడం.. కాసేపు మాట్లాడుకోవడం రాజకీయంగా చర్చణీయాంశమైంది. కాసాని కూడా వారికి జతకలవడం.. కాంగ్రెస్, బీజేపీ, టీటీడీపీ బాస్ ల మిలాఖత్.. బీఆర్ఎస్ బిగ్ బాస్ ను షాక్ కు గురి చేసి ఉంటుందని అంటున్నారు. ఒకే ఫ్రేమ్ లోకి ఆ ముగ్గురు రావడం.. మాట్లాడుకోవడం.. రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.