Musi Riverfront: స్వేచ్ఛ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD) లోని బోధి పెవిలియన్లో నిర్వహించిన ఈ సమావేశంలో మూసీ మొదటి దశ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టును వేగవంతం చేయడంతో పాటు బాధితులకు పూర్తి న్యాయం చేయడమే లక్ష్యంగా సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, మున్సిపల్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మూసీ ప్రాజెక్ట్ ఎండీ నర్సింహారెడ్డి, జాయింట్ ఎండీ గౌతమి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పేదలకు అండగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం) పరిధిలో ఉంటూ ఇళ్లను కోల్పోతున్న పేద ప్రజలందరికీ తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాధితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే భూసేకరణలో భూములు కోల్పోయే వారికి, వారి ఆసక్తి మేరకు ‘ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్’ (TDR) ఇవ్వాలని లేదా నిబంధనల ప్రకారం తగిన నగదు పరిహారం చెల్లించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
రక్షణ శాఖ భూముల తరలింపు వేగవంతం
గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన డిఫెన్స్ (రక్షణ శాఖ) భూములపై కూడా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ భూముల్లో ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోనే సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
నెక్లెస్ రోడ్డులో ‘మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్’
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో ప్రభుత్వం చేపట్టబోయే పనులు, భవిష్యత్తు నమూనా ప్రజలందరికీ తెలిసేలా హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్డులో ‘మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సెంటర్ కేవలం ప్రదర్శనకే పరిమితం కాకుండా, మూసీ ప్రాజెక్టుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను సేకరించే ఒక వేదికగా ఉపయోగపడాలని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తూనే, స్థానిక ప్రజల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పనుల్లో పారదర్శకత పాటించాలని సీఎం అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.