Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చడంతో పాటు, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలను పరుగులు పెట్టించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర పేదలకు ఇళ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, డిఫాల్ట్ రైస్మిల్లర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కేపీహెచ్బీలో తొలి ‘ఇందిరమ్మ టవర్స్’
పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం కేపీహెచ్బీ లో తొలి ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేపీహెచ్బీ 7, 9 ఫేజ్ల మధ్య, మలేషియన్ టౌన్షిప్కు ఎదురుగా ఉన్న అత్యంత విలువైన హౌసింగ్ బోర్డు స్థలంలో ఈ టవర్లను నిర్మించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనుండగా, ఇవి BPL కుటుంబాలకు అందుబాటులోకి రానున్నాయి.
సాగునీటి రంగంపై విస్తృత సమీక్ష
మరోవైపు నీటిపారుదల శాఖను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్లోని MCR HRD బోధి పెవిలియన్లో నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయడం, నీటి వనరుల సమర్థ నిర్వహణపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
డిఫాల్ట్ మిల్లర్లకు హెచ్చరికలు
పౌరసరఫరాల శాఖ సమీక్షలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్ల బ్లాక్మెయిలింగ్ సహించేది లేదని, బకాయిలను తక్షణమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. బకాయిలు కట్టని మిల్లులను స్వాధీనం చేసుకుని, వాటి బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలన్నారు. పైలట్ ప్రాజెక్ట్గా ఐదు నియోజకవర్గాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 50 నుంచి 100 ఎకరాల్లో గోదాములను నిర్మించాలని ఆదేశించారు.
Also Read: సిరిసిల్లలో పడిపోతున్న గ్రాఫ్.. అలర్ట్ అయిన కేటీఆర్!