నిరుద్యోగుల అసంతృప్తి పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగాల కల్పనలో విఫమవుతున్నదనే వ్యతిరేకతా పెరుగుతున్నది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఖాళీలన్నీ పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రకటించి ఉన్నది. అవసరమైతే ఏడాదికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామనే హామీలు నిరుద్యోగులపై బాగా పని చేశాయి. అవి ఆచరణలోకి రాకపోవడంతో ఇప్పుడు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు.
ఇవాళ కోదండరామ్ను అడ్డుకున్నారు కొంత మంది నిరుద్యోగులు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా.. ఎందుకు నిరుద్యోగుల పక్షాన మాట్లాడటం లేదు.. ఉద్యోగాల విషయంలో సర్కార్ను ఎందుకు ఒత్తిడి చేయడం లేదనే ప్రశ్నలు ఎదురయ్యాయి కోదండరామ్కు. కానీ వాస్తవానికి కోదండరామ్ ఈ విషయంలో ప్రభుత్వంతో ఒంటరి పోరు చేస్తున్నారనే చెప్పాలి.
ఆయన అభ్యర్థన అరణ్య వేదనే అవుతోంది. గత ఏడాది నుంచి ఉద్యోగాల కల్పన విషయంలో కోదండరామ్ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు ప్రభుత్వ పెద్దల చుట్టూ. కానీ పెద్దలు ఆయన్ను పట్టించుకోవడం లేదు. సీఎం రేవంత్రెడ్డిని రెండు పర్యాయాలు ఇదే అంశంపై ప్రత్యేకంగా కలిశారు కోదండరామ్. అయితే కలిసిన ప్రతిసారీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి చర్చించాల్సిందిగా సూచన చేస్తున్నారాయన. కానీ అక్కడ పరిస్థితి సానుకూలంగా కనిపించలేదు కోదండరామ్కు.
దీనిపై అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు డిప్యూటీ సీఎం. గత ఏడాది కాలంగా నాలుగు సార్లు ఇదే విషయంపై భట్టికి కలిశారు కోదండరామ్. అద్దంకి దయాకర్తో కలిసి ఓసారి, టీజీపీఎస్సీ మెంబర్స్తో ఓ సారి, పర్సనల్గా తన టీమ్తో ఓసారి .. ఇలా కలిసినా..భట్టికి ఇది పట్టలేదు. వీరిని పట్టించుకోలేదు. ఇప్పుడు కోదండరామ్ మెడకు చుట్టుకున్నదిది. అప్పుడు కోదండరామ్ ను చూసే చాలా మంది కాంగ్రెస్ వెంట నిడిచారు నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు.
ఇప్పుడు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. తనకు మాత్రం ఎమ్మెల్సీని ఇప్పించుకోగలిగారు..అనే విమర్శలు ఇప్పుడు మరింత పదునుగా ఆయనను తాకుతున్నాయి. కానీ ఈ విషయంలో కోదండరామ్ చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసినా.. అక్కడ నుంచి స్పందన రాకపోవడంతో నిస్సహాయుడిగా ఉండిపోతున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా వేయడం ద్వారా , నిరుద్యోగులు వాటిపై దృష్టి పెడతారని, లేదా వారు తిరగబడితే ఆపడం తరం కాదని హెచ్చరించిన దాఖలాలు కూడా ఉన్నాయి.
కానీ సర్కార్ మాత్రం దీన్ని ఒకరిపై మరొకరు నెపం వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు.. మధ్యలో కోదండరామ్ను ముందు పెట్టి తప్పించుకుందామని చూస్తున్నారు. కానీ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనేది ఎల్లవేళలా కరెక్టు కాదు.. తప్పించుకు తిరిగితే నడవదు సుమతీ అని కూడా భావించాల్సి వస్తది పరిస్తితి ఇలాగే ఉంటే.