కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకున్న వేళ రాజకీయ విమర్శలు హద్దులు దాటుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూడీఎఫ్ అభ్యర్థుల విజయం కోసం కేరళలో పర్యటిస్తూ ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ప్రధాని నరేంద్ర మోడీకి కేరళ సీఎం పినరయి విజయన్ అత్యంత సన్నిహితుడంటూ రేవంత్ సంబోధించారు. వీరిద్దరిని ‘మోడీ బ్రదర్స్’ అని పిలుస్తూ కేరళలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన ఆరోపించారు. విజయన్ పాలనను ‘చీకటి యుగం’గా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి విజయన్ అంతే దీటుగా కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి విమర్శలను అజ్ఞానంతో కూడినవిగా విజయన్ కొట్టిపారేశారు. తెలంగాణలో పేదల గృహాలపై బుల్డోజర్లు నడిపిస్తున్న విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. సొంత రాష్ట్రంలో పేదల గూడు చెడగొడుతున్న వ్యక్తి కేరళకు సామాజిక ప్రగతి గురించి నీతులు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని ఎవరో కావాలనే తప్పుదోవ పట్టించారని విజయన్ పేర్కొన్నారు. తన సుస్థిర సమ్మిళిత అభివృద్ధి నమూనాను దెబ్బతీయాలని చూస్తున్న శక్తులకు రేవంత్ ఒక ప్రతినిధిగా మారారని విజయన్ మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి సూచీ (2023–24)ని విజయన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలోనే అత్యంత తక్కువ అవినీతి గల రాష్ట్రంగా కేరళ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. ఇదే జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో ఉందని రేవంత్ తెలుసుకోవాలని సూచించారు. కేరళలో పేదరికం రేటు కేవలం 0.55 శాతమేనని ఇది దేశంలోనే అత్యల్పమని ఆయన స్పష్టం చేశారు. అక్షరాస్యత రేటు పెంచడంలో శిశు మరణాల రేటు తగ్గించడంలో కేరళ ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందుతోందని వివరించారు. తెలంగాణ కంటే అన్ని సామాజిక రంగాల్లో కేరళ ఎంతో మెరుగైన స్థితిలో ఉందని గణాంకాలను సాక్ష్యంగా చూపారు.
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉందని విజయన్ విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు కూడా సక్రమంగా చెల్లించలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. అటువంటి అస్తవ్యస్తమైన పాలన సాగిస్తున్న వ్యక్తి నుండి కేరళ నేర్చుకోవాల్సింది ఏమీ లేదని కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి రేవంత్ రెడ్డే కేరళకు వచ్చి ఇక్కడి పాలన పాఠాలు నేర్చుకోవాలని చురకలంటించారు. రేవంత్ రెడ్డి ఆరోపణలు కేవలం ఎన్నికల స్టంట్ అని విజయన్ కొట్టిపారేశారు. కేరళ ప్రజలు విజ్ఞులని ఇటువంటి అసత్య ప్రచారాలను వారు నమ్మరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేరళ మోడల్ అభివృద్ధిని విమర్శించే ముందు తెలంగాణ వాస్తవ పరిస్థితులను చూసుకోవాలని రేవంత్ రెడ్డికి విజయన్ సూచించారు.
ALSO READ: బిల్డ్ నౌ పోర్టల్ మ్యాజిక్.. జీహెచ్ఎంసీ సరికొత్త రికార్డు.. గత ఏడాది కంటే ఆదాయంలో పెరిగిన వృద్ధి