Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో తనకున్న అనుబంధాన్ని ఆసక్తికరంగా పంచుకున్నారు. రాష్ట్రంలో ఎలాంటి చిన్న సంఘటన జరిగినా రాహుల్ గాంధీ నేరుగా తనకే ఫోన్ చేసి సమాచారం ఇస్తుంటారని, వారితో తనకు అంతటి చనువు ఉందని చెప్పారు. తాను ఎప్పుడైనా ఒక నాయకుడిని నమ్మి వారితో కలిసి పని చేస్తే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే చివరి వరకు వారికే అండగా నిలబడతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో తన పాత రాజకీయ గురువు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి కూడా ఆయన మాట్లాడారు. చంద్రబాబు చుట్టూ ఎంతమంది నాయకులు ఉన్నప్పటికీ, ఆయన దగ్గర తనకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని రేవంత్ అన్నారు. గతంలో తాను టీడీపీని వీడే సమయంలో కూడా దాగుడుమూతలు ఆడకుండా, నేరుగా చంద్రబాబు దగ్గరికే వెళ్లి విషయం చెప్పి, ఆయన ఆశీస్సులు తీసుకుని బయటకు వచ్చానని గుర్తు చేసుకున్నారు.
ఇక దేశ రాజకీయాలపై స్పందిస్తూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ తదుపరి ప్రధాని కావడం ఖాయమన్నారు. రాహుల్ను పీఎం పీఠంపై కూర్చోబెడతామని తాము గతంలోనే ప్రజలకు మాట ఇచ్చామని, ఆ లక్ష్యం కోసమే తామంతా శ్రమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి..
‘తన జీవితంలో తాను అనుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ZPTCగా కెరీర్ ప్రారంభించాలనుకున్నప్పుడు అలాగే జరిగింది. ఆ తర్వాత ఎమ్మేల్సీ, ఎమ్మేల్యే అవ్వాలనే నా సంకల్పం నెరవేరింది. 2014లో ఎంపీగా గెలవలేకపోయినా, 2019లో అదే స్థానం నుండి విజయం సాధించాను. ప్రత్యేక తెలంగాణ వస్తే నేనే సీఎం అవుతానని నాడు చెప్పాను, నేడు ఆ మాటను నిజం చేసి చూపించాను. 2034 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాసేవలోనే ఉంటాను. ఆ తర్వాత 2034లో తెలంగాణలో కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి, ఆపై జాతీయ రాజకీయాల్లో అడుగుపెడతాను’ అని ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో చెప్పారు.
Also Read: ఈ తల్లి ధైర్యానికి చేతులెత్తి మొక్కాల్సిందే.. నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న సమస్తిపూర్ వీడియో!