RevanthReddy: కరీంనగర్లో కదం తొక్కేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హాథ్సే హాథ్ జోడో పాదయాత్ర ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం అంబేడ్కర్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భగేల్, జైరాం రమేశ్లత పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్రావుఠాక్రే, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరుకానున్నారు.
సాయంత్రం 6 గంటలకు రేవంత్రెడ్డి భారీ కాన్వాయ్తో కరీంనగర్కు చేరుకుంటారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి రేవంత్రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా పాదయాత్రతో కోతిరాంపూర్, కమాన్ సిఖ్వాడి ద్వారా అంబేద్కర్ స్టేడియం చేరుకుంటారు. 7 గంటలకు సభ ప్రారంభం కానుంది.
2004లో సోనియాగాంధీ ఇదే మైదానంలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఇదే చోటు నుంచి ఆమెకు కృతజ్ఞతను తెలిపేందుకు ఈ సభను వేదికగా మలుచుకుంటున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్రలో భాగంగా ప్రకటించారు.
సభను విజయవంతం చేసేందుకు పెద్దఎత్తున జనసమీకరణ చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి భారీగా జనాన్ని రప్పించేలా ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్ స్టేడియంలో 25 వేల మంది సామర్ధ్యముండగా స్టేడియం చుట్టూ ఎల్ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేయనుండటంతో మరో 10 నుంచి 15 వేలపైగా జనాలు సభను తిలకించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సభకు వచ్చేవారికి తాగునీటి వసతి ఏర్పాట్లు చేశారు. స్టేడియంలో షామియానాలు, అగ్రనేతల కట్అవుట్లు ఏర్పాటు చేశారు.
పాదయాత్ర, బహిరంగ సభ సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్లతో పాటు స్టేడియం దగ్గర, పాదయాత్ర మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు పోలీసుల అనుమతికి కొన్ని అభ్యంతరాలతో జాప్యం జరగ్గా, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి డీఐజీతో మాట్లాడిన తరువాత అంబేద్కర్ స్టేడియంలో సభ జరిపేందుకు పోలీసులు రెండు రోజుల క్రితమే అనుమతి ఇచ్చారు. సమయం తక్కువగా ఉన్నా.. ముమ్మర ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గడ్డపై.. భారీ బలప్రదర్శన చేసేందుకు సిద్ధమైంది.