Jeep New SUV To Launch In 2027: జీప్ ఇండియా తన లైనప్ మరింత అప్ డేట్ చేయాలని భావిస్తోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తన కార్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా 2.0 స్ట్రాటజీని ప్రకటించింది. ఈ రోడ్ మ్యాప్ లో భాగంగా, జీప్ బ్రాండ్ 2027లో పూర్తిగా కొత్త SUVని లాంచ్ చేయబోతోంది. ఐదు సంవత్సరాలలో తొలిసారి పూర్తిగా కొత్త మోడల్ ను మార్కెట్ కు పరిచయం చేస్తుంది. అదే సమయంలో దాని ప్రస్తుత మోడల్ కు సంబంధించి ప్రత్యేక ఎడిషన్లను విడుదల చేయనుంది.
జీప్ కొత్త స్ట్రాటజీలో భాగంగా.. మహారాష్ట్రలోని రంజన్గావ్ ఫెసిలిటీ లో తయారు చేసిన కార్లను జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో పాటు ఆఫ్రికా, నార్త్ అమెరికా ప్రాంతాల మార్కెట్లకు ఎగుమతి చేయాలని భావిస్తోంది. నిజానికి, ఉత్తర అమెరికా బయట జీప్ కంపెనీ రైట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్లకు తయారు చేసి ఎగుమతి చేసే మొదటి భారత్ కానుంది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, కంపెనీ ప్రస్తుతం 70 శాతం వరకు ఉన్న స్థానిక వనరులను ఉపయోగించుకుంటుండగా, ఇకపై 90 శాతానికి పెంచాలని భావిస్తోంది. అటు ప్రీ మెయింటెనెన్స్, అదనపు వారంటీ, కస్టమర్ కేర్ ప్రోగ్రామ్ల ద్వారా మరిన్ని అమ్మకాలను కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం జీప్ కంపాస్, మెరిడియన్, రాంగ్లర్ ఆఫ్ రోడర్, ఫ్లాగ్ షిప్ గ్రాండ్ చెరోకీని ఇండియన్ మార్కెట్ లో అందుబాటులో ఉంచింది.
జీప్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి స్టెల్లాంటిస్ ఇండియా CEO, MD శైలేష్ హజెలా కీలక విషయాలు వెల్లడించారు. జీప్ 85 సంవత్సరాల వారసత్వం అనేది తమ ప్రామాణికత, సాహసం మీద నిర్మించబడిందన్నారు. జీప్ 2.0 ప్లాన్ లో భాగంగా తమ ఉత్పత్తి వ్యూహాన్ని మరింత పెంచబోతున్నట్లు తెలిపారు. అదే సమయంలో కస్టమర్ అనుభవాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. పెద్ద మొత్తంలో స్థానికీకరణ, ప్రపంచ స్థాయి ఉత్పత్తి దృష్టిలో పెట్టుకుని తమ వాహనాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు.
Read Also: హ్యుండాయ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు.. దీనికి బ్రేకులు ఉండవు తెలుసా?
ప్రస్తుతం జీప్ బ్రాండ్ తన కస్టమర్లను జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి పెట్టినట్లు శైలేష్ తెలిపారు. జీప్ కంపెనీ నుంచి వారు ఆశించే సపోర్ట్, సర్వీస్, నమ్మకానికి అనుగుణంగా పని చేస్తున్నట్లు చెప్పారు. దీర్ఘకాలికంగా కంపెనీ అభివృద్ది లక్ష్యంగా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జీప్ బ్రాండ్ కు మరింత ఆదరణ దక్కించుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత కొద్ది కాలంగా మార్కెట్ లో జీప్ సంస్థ అంతగా రాణించలేకపోతుంది. అందుకే, కస్టమర్ సర్వీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, మళ్లీ తమ బ్రాండ్ ఆదరణ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
Read Also: MV అగస్టా రష్ టైటానియో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్, డిజైన్ భలే ఉంది గురూ!