Women Safety: స్వేచ్ఛ బ్యూరో: ఓ ఆడపిల్ల ఇంట్లో నుంచి కాలు బయట పెడితే క్షణక్షణం భయపడాల్సిన పరిస్థితి. వెంట పడి వేధించేవారు కొందరైతే.. అసభ్యంగా తాకుతూ.. జోకులు వేస్తూ మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్న వారు ఇంకొందరు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా బ్లాక్ మెయిలింగ్ చేస్తూ కోరికలు తీర్చుకోవటానికి ప్రయత్నించే కంత్రీలు మరికొందరు. మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తూ డబ్బు గుంజే కేటుగాళ్లు కూడా ఉన్నారు. చదువుకునే చోట.. వర్కింగ్ ప్లేస్లో.. వచ్చిపోయే దారిలో నిత్యం ఇలాంటి కీచకులు ఎదురవుతూనే ఉంటారు. అయితే, బాధితురాళ్లు మౌనంగా ఉండిపోతుండటం వల్లనే ఈ సైకోలు అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. అలా కాకుండా ధైర్యంగా తమపట్ల వేధింపులకు పాల్పడుతున్న వారిని ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి వారికి పోలీసుల అండ ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇస్తున్నారు.
ట్రై కమిషనరేట్లలోని షీ టీమ్స్ సిబ్బంది ఎప్పుడు డెకాయ్ ఆపరేషన్లు జరిపినా పదుల సంఖ్యలో పోకిరీగాళ్లు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఆందోళనాకరమైన అంశం ఏమిటంటే వీరిలో మైనర్లు కూడా ఉంటుండటం. యువతులు, మహిళలను వేధించటమే తమ పని అన్నట్టుగా ఈ ఆవారాగాళ్లు బస్టాపులు మొదలుకుని రద్ధీ ఎక్కువగా ఉండే ప్రతీచోటా అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నా.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ జరుపుతున్నా చాలామందిలో మార్పు కనిపించటం లేదు. వీరి ఆగడాలు ఇలా ఉంటే పని చేసే చోట మహిళలు, యువతులకు ఎదురవుతున్న వేధింపులు అన్నీ ఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లొంగదీసుకోవాలని ప్రయత్నించే గోముఖ వ్యాఘ్రాలు కొందరైతే.. స్నేహం నటించి ఉచ్ఛులోకి లాగాలని ప్రయత్నించే వారు మరికొందరు.
ఈ క్రమంలో కొందరు మృగాళ్లు అన్ని హద్దులు దాటేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఇన్ స్టాగ్రాం, టెలిగ్రాం, ఫేస్ బుక్, వాట్సాప్ ల నుంచి టార్గెట్ గా చేసుకున్న వారి ఫోటోలను డౌన్ లోడ్ చేస్తున్న వీళ్లు మార్ఫింగ్ చేయటం ద్వారా వాటిని అభ్యంతరకరంగా మారుస్తున్నారు. ఏఐ డీప్ ఫేక్ సహాయంతో అశ్లీల వీడియోలు సైతం తయారు చేస్తున్నారు. ఆ తరువాత వాటిని బాధితురాళ్లకు పంపిస్తూ తాము చెప్పినట్టుగా నడుచుకోకపోతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బెదిరించి డబ్బు కొల్లగొడుతున్నారు. కొన్నిసార్లు తమతోపాటు తీసుకెళ్లి లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారు.
అయితే, బాధితురాళ్లు అన్ని బాధలను మౌనంగా సహిస్తుండటం వల్లనే ఇలాంటి వారు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ అన్నారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా కుటుంబ సభ్యులకు తెలియ చేయాలని సూచించారు. మహిళల రక్షణకు పోలీసులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. షీ టీమ్స్ ఈ లక్ష్యంతోనే ఏర్పాటు చేసినవే అన్నారు. ఎవరైనా వేధింపులకు పాల్పడుతున్నట్టయితే వెంటనే స్థానిక పోలీసులు లేదా షీ టీమ్స్, సైబర్ క్రైం పోలీసులకు కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. పోలీసులకు చెబితే అందరికీ విషయం తెలిసిపోయి పరుగు పోతుందని ఏమాత్రం భావించ వద్దన్నారు. బాధితురాళ్ల వివరాలను గోప్యంగా పెడతామన్నారు. ఇక, సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలను షేర్ చేసుకోవద్దన్నారు. వాట్సాప్ డీపీగా కూడా ఫోటోలు పెట్టుకోకపోవటం మంచిదని సూచించారు. మౌనాన్ని వీడి ధైర్యంగా ముందుకొచ్చినపుడే యువతులు, మహిళలు సురక్షితంగా ఉంటారన్నారు.