Uttam Kumar Reddy: దక్షిణ తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేస్తోంది. హైదరాబాద్లోని జలసౌధలో ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాబోయే 30 నెలల వ్యవధిలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అలాగే 2027 మార్చి నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా నీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కల్వకుర్తికి రూ. 909 కోట్లు, నెట్టెంపాడుకు రూ. 252 కోట్లు, భీమాకు రూ. 200 కోట్లు, కోయిలసాగర్కు రూ. 185 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. ముఖ్యంగా భూసేకరణ పనులకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, జూన్ 2 నాటికి రూ. 5000 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు వెల్లడించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని, అంచనాలను పెంచి నిధులు వృథా చేసిందని ఆయన ధ్వజమెత్తారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆఫ్టేక్ పాయింట్ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 27,000 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో డిసెంబర్ 7 నుండి ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై రూ. 7161 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అంచనాలు పెరిగినా సరే, ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు (డీసిల్టింగ్) తక్షణమే పనులు ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మట్టి పేరుకుపోవడం వల్ల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీల నుండి 9 టీఎంసీలకు తగ్గిందని, దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా నదిపై తెలంగాణకు ఉన్న హక్కులను కాపాడుకుంటూనే, వ్యవసాయ రంగంలో రికార్డు స్థాయి పురోగతి సాధిస్తామని, గత ఖరీఫ్లో 148.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించడమే ఇందుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Mamata vs Modi: రాష్ట్రపతి నిలబడి ఉంటే.. మోదీ కూర్చున్నారు.. పాత ఫోటోతో మమత కౌంటర్