Air Pollution: సల్ఫర్ డయాక్సైడ్.. దాన్నే SO2 అని పిలుస్తారు. ఇదే ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీస్తున్న సైలెంట్ కిల్లర్. ఒక వైపు నగరం అభివృద్ధి చెందుతోంది. మరోవైపు మనుషుల ప్రాణాలను తీసే ఈ విషవాయువు గాలిలో పెరిగిపోతోంది. పెరగడం మాత్రమే కాదు.. ఇప్పుడిది ప్రమాదకర స్థాయికి చేరిందని లెటెస్ట్ స్టడీలు చెబుతున్నాయి. నగరంతో పాటు నగరశివారు ప్రాంతాల్లో కిలోల కొద్దీ సల్ఫర్ డయాక్సైడ్ విడుదల అవుతున్నట్లు ఐఐటీ కాన్పూర్ తమ నివేదికలో తెలిపింది.
పర్యావరణవేత్తల హెచ్చరిక
సిటీలోని డీజిల్ వెహికిల్స్ నుంచి వెలువడే పొగ, ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని పరిశ్రమల ఉద్గారాలు కలిసి ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విషవాయువు మానవాళితో పాటు పర్యావరణానికి కూడా హాని చేస్తుందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. SO2 వర్షంతో కలిసినప్పుడు యాసిడ్ రెయిన్గా మారుతుంది. దీని వల్ల నేల సారం తగ్గడమే కాదు… పంటలు కూడా దెబ్బతింటాయి. చెట్లు ఎండిపోతాయని పర్యావరణవేత్తలు అంటున్నారు.
హైదరాబాద్లో SO2 కాలుష్యం ఆందోళన!
IIT కాన్పూర్ స్టడీలోని కొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో రోజుకు సగటున 18 వేల 101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ గాలిలోకి విడుదలవుతోంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 10 వేల 701 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఇక నగరవ్యాప్తంగా SO2లో 91 శాతం వెహికిల్స్ నుంచే విడుదల అవుతోందని.. అందులో ప్రధానంగా డీజిల్ వెహికిల్స్ నుంచే వస్తుందని రిపోర్ట్ చెబుతోంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో 92 శాతం SO2 పరిశ్రమల నుంచే వస్తోంది. ఇలా నగరంలో నగరశివారు ప్రాంతాల్లో ఊపిరి ఊహకందని విధంగా విషంగా మారుతోంది..
శ్వాసకోశాలపై హానికర ప్రభావాలు
సల్ఫర్ డయాక్సైడ్ ఒక సాధారణ కాలుష్య వాయువు కాదు. ఇది ఫాసిల్ ఇంధనాల దహనంతో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా డీజిల్, బొగ్గు వాడకం ఎక్కువైన చోట దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సల్ఫర్ డయాక్సైడ్ ను పీల్చినప్పుడు అది శ్వాసనాళాల ద్వారా శరీరంలోకి వెళ్లి ఊపిరితిత్తులను డ్యామేజ్ చేస్తుందని పల్మనాలజిస్ట్ లు హెచ్చరిస్తున్నారు.
నగరంలోని కాలుష్యంపై డాక్టర్ల హెచ్చరిక
భాగ్యనగరం ఇప్పటికే కాలుష్య కోరల్లో ఉంది. ఊపిరి తీసుకోవడమే కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో సల్ఫర్ డయాక్సైడ్ విషవాయువు ప్రాణసంకటంగా మారుతోంది. ఇది స్లో పాయిజన్గా శరీరంలోకి చేరి ప్రాణాలు తీసేలోపు ముందే జాగ్రత్త పడటం మంచిదంటున్నారు డాక్టర్లు. బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అలాగే పరిశ్రమల చుట్టుపక్కల ఉండే నివాసితులు ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ లు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.