ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నేరడిగొండ మండలం చిన్న బుగ్గరాం గ్రామంలో గ్రామస్థులు, పోలీసుల మధ్య తలెత్తిన ఘర్షణ రణరంగాన్ని తలపించింది. సర్పంచ్ అభ్యర్థుల మధ్య మొదలైన రాజకీయ విభేదాలు చివరకు పోలీసులపై దాడి చేసే వరకు వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి, ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఇంటి వద్ద ఇరు వర్గాలు తలపడినట్టు తెలుస్తోంది. మాట మాట పెరిగి ఒకరినొకరు దూషించుకుంటూ ఘర్షణకు దిగారు. ఈ గొడవ పెద్దదవుతుందన్న సమాచారంతో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేశారు.
గొడవను సద్దుమణిగేలా చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో.. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి కుమారుడిపై పోలీసులు చేయి చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు ఒక్కసారిగా తిరగబడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే లాఠీలకు పనిచెప్పడం ఏంటని స్థానికులు ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి అదుపు తప్పింది.
గ్రామస్థులు పోలీసులపైకి దూసుకెళ్లడంతో గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు ఒకరినొకరు కొట్టుకోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితిని గమనించిన ఉన్నతాధికారులు అదనపు బలగాలను చిన్న బుగ్గరాం గ్రామానికి తరలించారు. గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని వాతావరణం నెలకొంది. తమపై అకారణంగా దాడి చేశారంటూ పోలీసులపై గ్రామస్థులు నినాదాలు చేశారు.
ప్రస్తుతం పోలీసులు గ్రామంలో భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గొడవకు కారణమైన వారిని గుర్తించి విచారణ చేపట్టారు. రాజకీయ కక్షల వల్ల గ్రామాల్లో ఇలాంటి ఘర్షణలు జరగడం దురదృష్టకరమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Peeing: మూత్రాన్ని ఆపుకుని మహిళ మృతి.. అలా చేయడం అంత డేంజరా? ఏమవుతుంది?