Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే, ఆ గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 10 లక్షల నిధులు అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివృద్ధి వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించేందుకు ఈ నిధులు ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 5 లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మొండిచేయి చూపిందని బండి సంజయ్ విమర్శించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఏకగ్రీవం పేరుతో నజరానా ప్రకటించి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల మాటలు నమ్మి ఏకగ్రీవం చేసిన పంచాయతీల ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని గుర్తు చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు ఆ రెండు పార్టీలు మళ్లీ ప్రలోభ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయని అన్నారు. వారి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తోంది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే అని బండి సంజయ్ ఉద్ఘాటించారు. కేంద్ర మంత్రి ప్రకటించిన ఈ రూ. 10 లక్షల బంపర్ ఆఫర్ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయాల్లో పంచాయతీ ఎన్నికలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి.
ALSO READ: Jangaon District: మద్యంప్రియుల వింత డిమాండ్.. వైన్ షాప్ను గ్రామంలోకి తరలించాలని డిమాండ్