Electricity: భాగ్యనగరం మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విడిపోయిన నేపథ్యంలో, అందుకు అనుగుణంగా తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) కూడా తన పరిపాలనా యంత్రాంగాన్ని సరిదిద్దే పనిలో పడింది. మున్సిపల్ సరిహద్దులకు లోబడి విద్యుత్ సర్కిళ్లను మార్చేందుకు కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుతం విద్యుత్ సర్కిళ్లు పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిని బట్టి ఉన్నాయి. ఇప్పుడు నగరం మూడు కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మేడ్కల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విభజించారు. మూడు ముక్కలుగా విడిపోవడంతో అందుకు అనుగుణంగా సర్కిళ్ల వారీగా మార్పులకు ఎస్పీడీసీఎల్ సిద్ధమవుతోంది.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే విద్యుత్ సెక్షన్లు, సబ్-డివిజన్లను ఆయా కొత్త కార్పొరేషన్ల పరిధిలోకి చేర్చనున్నారు. ఈ విభజన ప్రక్రియను మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాలని మేనేజ్మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఏ సర్కిల్ ఏ కార్పొరేషన్ కిందికి వెళ్లాలి? ఏయే డివిజన్లను విలీనం చేయాలి? అనే అంశాలపై ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1 నుంచి ఈ పునర్వ్యవస్థీకరించబడిన సర్కిళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ప్రజలకు బిల్లింగ్ సమస్యలు తగ్గడంతో పాటు, స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి అభివృద్ధి పనులను(లైన్ల మార్పిడి, పోల్ షిఫ్టింగ్ వంటివి) వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం ఎస్పీడీసీఎల్ నాలుగు జోన్లుగా విభజించింది. అందులో 10 సర్కిళ్లు ఉన్నాయి. కాగా ఇప్పుడు కార్పొరేషన్ల మఖ చిత్రం మారడంతో అందుకు అనుగుణంగా సర్కిళ్లకు సరిహద్దులను మార్చబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త జోన్ల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పాత నగరంతో పాటు సెంట్రల్ జోన్లను కలిగి ఉంది. ఇందులో సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు ఉంటాయి.
Also Read; Student Protest: ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు.. జాగృతి విద్యార్థి విభాగం నేతలు అరెస్టు
వాటిలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, చార్మినార్, మెహదీపట్నం, ఫలక్నుమా, బహదూర్పురా, తార్నాక, ముషీరాబాద్ కీలక ప్రాంతాలుండనున్నాయి. ఇక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి ఐటీ కారిడార్, పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు దీని పరిధిలోకి వస్తాయి. మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, జీడిమెట్ల, గాజులరామారం కీలక ప్రాంతాలుగా ఉన్నాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి తూర్పు, ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలైన మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో ఏర్పడింది. కాప్రా, ఏఎస్రావు నగర్, నాచారం, హబ్సిగూడ, బోడుప్పల్, పీర్జాదిగూడ, సరూర్ నగర్, హయత్ నగర్, మన్సూరాబాద్, అల్వాల్ వంటి కీలక ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.
కార్పొరేషన్లకు అనుగుణంగా విద్యుత్ సర్కిళ్ల మార్పుతో త్వరితగతిన సేవలు అందించేందుకు ఎస్పీడీసీఎల్ సిద్ధమవుతోంది. విద్యుత్ సమస్యల పరిష్కారం మరింత వేగవంతం చేపట్టనుంది. మున్సిపల్ రోడ్ల విస్తరణ లేదా డ్రైనేజీ పనుల సమయంలో విద్యుత్ లైన్ల మార్పిడికి సంబంధించి కార్పొరేషన్ అధికారులతో సమన్వయం సులభం కానుంది. పరిధి తగ్గడం వల్ల అధికారులు క్షేత్రస్థాయిలో మెరుగైన పర్యవేక్షణ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అంతర్గత చర్చలు జరుగుతుండగా, త్వరలోనే అధికారికంగా కొత్త జోన్ల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read: Lavanya Tripathi: ప్రెగ్నెన్సీతోనే సతీ లీలావతి … భయపడుతూనే షూటింగ్ పూర్తి చేసానంటూ!