Secunderabad Identity: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న మార్పులు, కార్పొరేషన్ల విభజన ప్రతిపాదనలు ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీశాయి. చారిత్రక నేపథ్యం కలిగిన సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా గుర్తించకపోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం పేరుతో ఈ డివిజన్ల సంఖ్యను 300కు పెంచాలని, అలాగే జీహెచ్ఎంసీని విభజించి పలు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తొంది. అయితే, ఈ విభజన ప్రక్రియలో సికింద్రాబాద్ పేరుతో ప్రత్యేక కార్పొరేషన్ కానీ, జిల్లాను కానీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదన్నది తలసాని ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తలసాని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తలసాని తప్పుబట్టారు. “ఇది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన” అని విమర్శించారు. “నా సామ్రాజ్యం.. నా ఇష్టం” అన్నట్టుగా సీఎం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సికింద్రాబాద్ పేరును, ఇక్కడి కల్చర్ను దెబ్బకొట్టే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. 150 డివిజన్లను 300 చేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బ్రిటీష్ కాలం నాటి నుంచి సికింద్రాబాద్కు ఒక ప్రత్యేక చరిత్ర ఉందని, అందుకే దీనిని కేవలం ఒక జోన్గానో లేదా హైదరాబాద్లో భాగంగానో కాకుండా.. సికింద్రాబాద్ కార్పొరేషన్ లేదా లష్కర్ జిల్లాగా ప్రకటించాలని తలసాని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, సికింద్రాబాద్ పేరిట ప్రత్యేక గుర్తింపు ఇచ్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తలసాని ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. జనవరి 11న సికింద్రాబాద్లోని అన్ని వర్గాల అసోసియేషన్లు, మేధావులు, ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఉద్యమ విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. జనవరి 17న ప్రభుత్వం కళ్లు తెరిపించేలా 10 వేల మందితో సికింద్రాబాద్లో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే, నిరసనను ఉధృతం చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తలపెట్టిన మున్సిపల్ రీ-ఆర్గనైజేషన్ ఇప్పుడు “లష్కర్” సెంటిమెంట్ను రగిలించినట్లైంది.
Read Also: మోడీతో యుద్ధమే..రాష్ట్రంలో ఏం జరగబోతోంది!