Ganja Seized: సికింద్రాబాద్లో గంజాయి అక్రమ రవాణా , విక్రయాలపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ , చిలకలగూడ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు.
పక్కా సమాచారంతో పోలీసులు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు ప్రధాన గంజాయి విక్రయదారులు కాగా.. మిగిలిన నలుగురు గంజాయిని కొనుగోలు చేస్తున్న వినియోగదారులుగా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 11 కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా ఒడిశా రాష్ట్రం నుంచి అతి తక్కువ ధరకే గంజాయిని సేకరించి రహస్య మార్గాల ద్వారా హైదరాబాద్కు తరలిస్తోంది. నగరానికి చేరుకున్న తర్వాత, చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విద్యార్థులకు, కూలీలకు, యువతకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
చిలకలగూడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ప్రధాన సూత్రధారులు ఉన్నారా? ఒడిశాలో వీరికి గంజాయి సరఫరా చేస్తున్నది ఎవరు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నగరంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ‘డ్రగ్ ఫ్రీ సిటీ’ లక్ష్యంతో దాడులు మరింత ఉధృతం చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
Also Read:విషాదం.. కన్న బిడ్డలను బావిలోకి తోసేసి.. తల్లి కూడా!