సికింద్రాబాద్, మోండా మార్కెట్ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ఆక్రమణల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ అధికారులు జేసీబీలతో రంగంలోకి దిగడంతో స్థానిక వ్యాపారులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తమ పొట్టకొట్టడమేంటని ఆగ్రహించిన చిరు వ్యాపారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే ఈ ఘర్షణ పెరిగి పెద్దదై అధికారులపై దాడులకు దారితీసింది.
జేసీబీలను అడ్డుకున్న వ్యాపారులు వాటిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆవేదనతో ఉన్న బాధితులు వెనక్కి తగ్గలేదు. పోలీసుల సమక్షంలోనే ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో బల్దియా సిబ్బంది ప్రాణభయంతో అక్కడి నుండి పరుగులు తీశారు. అధికారుల తీరును నిరసిస్తూ వ్యాపారులంతా ఏకమై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం తమ ఉపాధిని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో బాధితులు వందలాదిగా తరలివచ్చి మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. స్టేషన్ ముందు బైఠాయించిన నిరసనకారులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నామని ఆక్రమణల పేరుతో షాపులు కూల్చడం అన్యాయమని వారు వాపోయారు. రోడ్డుపై ధర్నా నిర్వహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అదనపు బలగాలను రప్పించి మోండా మార్కెట్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాధితులతో చర్చలు జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు చెప్పడంతో ధర్నా విరమించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. మరోసారి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్ కూల్చివేతల్లో ఉద్రిక్తత
షాపులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ వ్యాపారుల ఆగ్రహం
పోలీసులు, జేసీబీలను అడ్డుకొని దాడికి యత్నం
భయంతో పరుగులు తీసిన GHMC సిబ్బంది
పోలీస్ స్టేషన్ని ముట్టడించి ఆందోళనకు దిగిన వ్యాపారులు
Tension during Demolition of… pic.twitter.com/1tdJ8jGq2Y
— BIG TV Breaking News (@bigtvtelugu) April 4, 2026
నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై వ్యాపార సంఘాల నేతలు మండిపడుతున్నారు. చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు మళ్లీ వస్తే ఊరుకునేది లేదని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Jagruti Party: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు.. తెలంగాణ జాగృతి పార్టీ పోస్టర్ ఆవిష్కరణ!