Siddipet: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన మెరుపు దాడి స్థానికంగా పెద్ద కలకలం రేపింది. కేవలం పది వేల రూపాయల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి సాయి ప్రసాద్, సర్పంచ్ భర్త గొల్లపల్లి ఆంజనేయులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం గమనార్హం.
అసలు విషయంలోకి వెళ్తే.. కొమురవెల్లికి చెందిన ఒక వ్యక్తి తన ఇంటి స్థలంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన డ్రైనేజీ పైప్లైన్ వేశారని, దాన్ని అక్కడి నుంచి తొలగించాలని పంచాయతీ కార్యాలయంలో విన్నవించుకున్నాడు. అయితే, ఆ పైప్లైన్ తొలగించాలంటే పది వేల రూపాయలు ఇచ్చుకోవాలని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త డిమాండ్ చేశారు. పని జరగాలంటే డబ్బులు ఇవ్వక తప్పదని భావించిన బాధితుడు, లోలోపల మదనపడకుండా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం పక్కా ప్లాన్ వేశారు. చెప్పిన ప్రకారం సర్పంచ్ భర్త, కార్యదర్శి కలిసి ఆ బాధితుడి నుంచి రూ. 10,000 నగదు తీసుకుంటుండగా అధికారులు ఒక్కసారిగా చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి చేతుల నుంచి రసాయన పరీక్షల ద్వారా నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ పనుల కోసం సామాన్యులను వేధిస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
Also Read: మౌనం వీడండి.. విద్యార్థులను కాపాడండి.. కేంద్రానికి కిరణ్ రెడ్డి పిలుపు