మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ.. సిరిసిల్ల పట్టణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం చోటుచేసుకుంది. గెలుపు గుర్రమెక్కాలని ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగి ఉండగా.. సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షమైన ఒక కరపత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు రేపుతోంది. క్షమించు రామన్న… ఈసారి మా ఓటు కారుకు కాదు అనే శీర్షికతో గుర్తుతెలియని వ్యక్తులు విడుదల చేసిన ఈ డిజిటల్ కరపత్రం ఇప్పుడు నియోజకవర్గవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆత్మగౌరవాన్ని కోరుకునే ఓటరు పేరుతో ఉన్న ఈ లేఖలో గత పదేళ్ల పాలనపై సంధించిన విమర్శలు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి.
అవినీతి ఆరోపణలు – కమిషన్ల రాజ్యం..
ఈ కరపత్రంలో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత లోపించిందని, ప్రతి పనిలోనూ భారీగా కమిషన్లు, పర్సెంటేజీల దందా నడిచిందని ఆరోపించారు. ముఖ్యంగా సిరిసిల్ల బ్రాండ్గా వెలుగొందిన బతుకమ్మ చీరల కాంట్రాక్టుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. ఇది నేత కార్మికులకు చెందాల్సిన లబ్ధిని కొందరు నేతల జేబుల్లోకి మళ్లించిందని కరపత్రంలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సామాన్యుడి గోడు వినేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక నేతల ఆగడాలు – స్టీరింగ్ లేని కారు..
పైస్థాయి నేతలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో.. స్థానిక గల్లీ లీడర్లు చెలరేగిపోయారని ఈ లేఖలో ధ్వజమెత్తారు. బెదిరింపులు, సెటిల్మెంట్లు, భూకబ్జాలతో సామాన్యులను వేధించారని.. బీసీ, దళిత, మైనారిటీ వర్గాల నాయకులను అవమానాలకు గురిచేశారని పేర్కొన్నారు. సిరిసిల్లను ఒక ప్రజాస్వామ్య నియోజకవర్గంగా కాకుండా.. కొందరు నేతలు తమ వ్యక్తిగత జాగీరుగా భావించారని ఆరోపించారు. వ్యవస్థ మొత్తం దారి తప్పిందని, ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితిని ‘స్టీరింగ్ లేని కారు’తో పోలుస్తూ ఓటర్లను ఆలోచింపజేసే ప్రయత్నం చేశారు.
ఓటరు తీర్పుపై ఉత్కంఠ..
మున్సిపల్ ఎన్నికల వేళ ఈ కరపత్రం వైరల్ కావడం వెనుక రాజకీయ ప్రత్యర్థుల హస్తం ఉందా లేక నిజంగానే అసంతృప్త ఓటర్ల ఆగ్రహమా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా.. ఆత్మగౌరవం అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రచారం గులాబీ పార్టీకి గట్టి సవాలుగా మారింది. నేత కార్మికుల సమస్యలు, స్థానిక నాయకత్వంపై అసంతృప్తి ఓటింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ‘డిజిటల్ అస్త్రం’ ఎన్నికల ఫలితాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.
ALSO READ: DGP Shivadhar Reddy: మున్సిపోరుకు భారీ బందోబస్తు.. 3వేల మంది అదనపు బలగాలు.. డీజీపీ కీలక సూచనలు