Weather Alert: బంగాళాఖాతంలో ఓ వైపు ఉపరితల ఆవర్తనం.. మరోవైపు నైరుతి రుతుపవనాల జోరుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణల్లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది.
ఏపీ-తెలంగాణల్లో విచిత్రమైన వాతావరణ నెలకొంది. ఒక రోజు ఎండ కాస్తే.. రెండు రోజులు వర్షాలు పడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరొక కబురు చెప్పింది. వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశాపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా రెండు లేదా మూడురోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఏపీ-తెలంగాణల్లో వర్షాలు పడనున్నాయి. శనివారం వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈసారి వర్షాలతో హైదరాబాద్లో రుతుపవన వర్షాల లోటు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
నైరుతి రుతుపవనాల కాలంలో తెలంగాణలో సాధారణ వర్షపాతం 402.1 మి.మీ కురిసేది. ప్రస్తుతానికి 379 మి.మీ వర్షపాతం నమోదు అయినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే మూడు రోజుల్లో వర్షాల కారణంగా రుతుపవన వర్షపాత లోటు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. యాదాద్రి -భువనగిరి, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, భూపాలపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి సెంట్రల్, తూర్పు హైదరాబాద్ అంతటా ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిశాయి.
ఇక ఏపీ విషయానికి వద్దాం.. ఏపీవ్యాప్తంగా అనేక జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని చెప్పుకొచ్చింది.
ALSO READ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఫిర్యాదులు!
వర్షాలు పడే సమయంలో ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ విషయంలో సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్ చేసిన వాతావరణ శాఖ, ఏలూరు, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 14న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేసింది. విశాఖపట్నం సిటీ బుచ్చిరాజుపాలెం- 9 సెంటీమీటర్లు, మహారాణిపేట- 8.9, విజయనగరం జిల్లా దత్తిరాజేరు-8.62, పార్వతీపురం జిల్లా సాలూరు-6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.