Special Trains: విమానాల రద్దుతో ప్రయాణికులు రైల్వే శాఖను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. అలాగే శబరిమల వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ చర్లపల్లి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
హైదరాబాద్, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్-కొట్టాయం, చర్లపల్లి-హజ్రరత్ నిజాముద్దీన్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు, చర్లపల్లి-యలహంక, చర్లపల్లి-షాలిమార్ మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు ఆదివారం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు రైల్వేస్టేషన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు ప్రయాణించనున్నాయి. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని ఇప్పటికే కల్పించినట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
ఈ నెల 8వ తేదీ రాత్రి 9.45 గంటలకు చర్లపల్లి నుంచి హజ్రరత్ నిజాముద్దీన్కు, 10వ తేదీ ఉదయం 4 గంటలకు హజ్రరత్ నిజాముద్దీన్ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలును నడపనున్నారు. 8వ తేదీ రాత్రి 10 గంటలకు చర్లపల్లి నుంచి యలహంకకు, అలాగే 9వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు యలహంక నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు నడపనున్నారు. సోమవారం రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి నుంచి షాలిమార్కు, 10న మధ్యాహ్నం 12.10 గంటలకు షాలిమార్ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు బయల్దేరనుందని రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 9.50 గంటలకు హైదరాబాద్ నుంచి కొట్టాయం, 10వ తేదీ ఉదయం 7.45 గంటలకు కొట్టాయం నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైలు నడపనున్నారు.