Telangana Rising Global Summit: రెండ్రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం ప్రారంభం కానుంది. 44 దేశాల నుంచి 154 మంది అతిథుల ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. 2 వేల మంది కూర్చొనేలా ప్రారంభ వేదిక సిద్ధం చేశారు. రేపు మధ్యాహ్నం1: 30 గంటలకు సమ్మిట్ ను ప్రారంభించనున్నారు. తొలిరోజు ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ నుంచి ఎరిక్ స్వేడర్ ప్రసంగించనున్నారు. రేపు మధ్యాహ్నం 2: 30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు జరగనున్నాయి.
రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగల కంపెనీల నుంచి ప్రతినిధుల బృందాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. అమెరికా నుంచే వివిధ కంపెనీలకు చెందిన 46 మంది ప్రతినిధులు సమ్మిట్ పాల్గొంటున్నారు.
తొలిరోజు సోమవారం మధ్నాహ్నం 1.30 గంటలకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. సదస్సులో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షాతో పాటు పలువురు ప్రసంగించనున్నారు.
రేపు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం ప్రసంగం కొనసాగనుంది. రెండు రోజుల సదస్సులో మొత్తం 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. అందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు. సదస్సు నిర్వహిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంగణమంతా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు.
సదస్సులో పాల్గొనే ప్రతినిధులను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ప్రత్యేక సంగీత కచేరితో అలరించనున్నారు. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్క్ బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం సందర్శించేలా పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అతిథులను తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లతో బహుమతిని అందించనున్నారు.