Stray Dogs: స్వేచ్ఛ బ్యూరో: అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద అదుపుతప్పి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. ముఖ్యంగా 2, 3, 4వ వార్డుల్లో పరిస్థితి విషమించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు ఎప్పుడైనా దాడి చేస్తాయనే భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. 3వ వార్డులో బుధవారం చిన్నారి పై కుక్క దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే కుక్కల దాడులతో పలువురు గాయపడిన ఘటనలు నమోదవుతున్నాయని స్థానికులు తెలిపారు. ఉదయం పాఠశాలకు వెళ్లే పిల్లలు, సాయంత్రం పనుల నుంచి తిరిగివచ్చే ప్రజలు కుక్కల దాడులకు గురవుతున్నారని వాపోయారు. 2వ, 4వ వార్డుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
రాత్రివేళల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ద్విచక్ర వాహనదారులు, పాదచారులపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతుండగా, మహిళలు ఒంటరిగా సంచరించేందుకు వెనుకాడుతున్నారు. కుక్కల బెడదపై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రాణనష్టం జరిగిన తర్వాతే చర్యలు తీసుకుంటారా?అంటూ ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పరిస్థితి అదుపుతప్పిందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రాంతమంతా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. రాత్రివేళల్లో కుక్కల అరుపులు, దాడులతో ప్రజలు నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: ఈ కొత్త ఫోన్ కొంటే.. రూ.6,000 డిస్కౌంట్తో పాటు రూ.2,000 విలువైన ఇయర్బడ్స్ ఫ్రీ!
వీధి కుక్కలను పట్టుకుని తరలించడం, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను అత్యవసరంగా చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కుక్కల నియంత్రణ చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
Also Read: యాదాద్రి జిల్లాలో 108 సిబ్బంది రికార్డు.. ఏం చేశారంటే..?