TSRTC City Buses : సమ్మర్ ఎఫెక్ట్ ఆర్టీసీపై కూడా పడింది. తెలంగాణలోని గ్రేటర్ ఆర్టీసీ కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల రీత్యా ఈ నెల 17 నుంచి సిటీలో ఆర్టీసీ బస్సుల సర్వీసులను కుదించనున్నట్టు ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బస్సు సర్వీసులను తగ్గించనున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని కోరారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పించినప్పటి నుంచి ఆర్టీసీలో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఆఫీసులు, కాలేజీలకు వెళ్లేవారంతా ఆర్టీసీనే ఆశ్రయిస్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్ ముందువరకూ.. త్వరగా గమ్యానికి చేరుకోవాలని మెట్రోలో వెళ్లేవారు. ఇప్పుడు ప్రయాణం ఫ్రీ కాబట్టి.. కాస్త లేటైనా పర్లేదనుకుంటూ.. ట్రాఫిక్ కష్టాలున్నా ఆర్టీసీనే నమ్ముకుంటున్నారు. కూతవేటు దూరంలో ఉన్న గమ్యానికి వెళ్లాలన్నా.. ఆర్టీసీనే వాడుతున్నారు.