Pedestrian Rights: స్వేచ్చ బ్యూరో: అయిదేళ్ల బాలుడు మరణించిన ఓ ప్రమాద పరిహార కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. రోడ్లపై తిరిగే వాహనాల కంటే పాదచారులకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పింది. ఫుట్పాత్లపై సురక్షితంగా నడవడం అన్నది రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ ఎ.ఎస్ చందుర్కర్తో కూడిన ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. చక్రాలు కనుగొనడానికి ముందే మనుషులు నడవడం ప్రారంభించారని పేర్కొంది.
ఈ నేపథ్యంలో రోడ్లపై తిరిగే వాహనాల హక్కుకన్నా ముందు నడిచే హక్కు ఉందని వ్యాఖ్యానించింది. నగరాల్లో, గ్రామాల్లో రోడ్లు నిర్మించినప్పుడు ఖచ్చితంగా పాదచారుల కోసం ఫుట్పాత్లను ఏర్పాటు చేయడం, వాటిని నిరంతరం నిర్వహించడం ప్రభుత్వాలు, స్థానిక సంస్థల బాధ్యతని కోర్టు పేర్కొంది. ఇది మున్సిపాలిటీలు దయతో చేసే పని కాదు. ఇది చట్టబద్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత అని స్పష్టం చేసింది.
Also read: వీడియో కాన్ఫరెన్స్ కుదరదు.. అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు బిగ్ షాక్!
రాజ్యాంగంలోని అత్యంత శక్తివంతమైన హక్కులతో ఈ తీర్పును ముడిపెట్టింది. దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా సంచరించే హక్కు అన్నది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)డి ప్రకారం ఉందని తెలిపింది. ప్రతి పౌరుడికి గ్యారంటీ ఇచ్చిన స్వేచ్ఛలో ఇది ఒక ముఖ్యమైన భాగమని చెప్పింది. కేవలం వాహనాల్లో తిరిగే వాళ్లకే ఈ హక్కు వర్తించదని, కాలినడకన వెళ్లే వారికి కూడా వర్తిస్తుందని తేల్చి చెప్పింది. రోడ్డుపై నడిచే పౌరుడికి సురక్షితమైన ఫుట్పాత్ కల్పించకపోవడం అంటే ఆర్టికల్ 21 కింద వారికి లభించిన జీవించే హక్కును ఉల్లంఘించడమే అని పేర్కొంది. సురక్షితమైన వాతావరణంలో ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా నడవగలిగినప్పుడే రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు అర్థం ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ తీర్పులో సుప్రీంకోర్టు సమాజంలో పాతుకుపోయిన అభిప్రాయాన్ని తప్పు పట్టింది. వాహనాలు పెరిగి పోతుండటంతో రోడ్డుపై నడిచే వ్యక్తులను ఒక న్యూసెన్స్ లాగా చూసే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించింది. నడిచేవారిని రోడ్డు పక్కకు నెట్టేసి వాహనాలే సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై ఇది సాగదని, మోటారు వాహనాల ప్రివిలేజ్ కంటే ఫుట్పాత్పై నడిచే పౌరుడి ప్రాథమిక హక్కుకే ప్రాధాన్యత ఉంటుందని బెంచ్ స్పష్టం చేసింది. బాలుని తండ్రికి ఇచ్చే పరిహారాన్ని 11లక్షల 44వేల 628 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also read: గట్టిగా చెప్పమన్న ప్రభాస్.. అరిచి మరీ చెప్పిన నాగ్ అశ్విన్.. వీడియో వైరల్!