Election Commission: స్వేచ్ఛ బ్యూరో: శబరిమల ఆలయం కేసుకన్నా ఎన్నికల కమిషనర్ల నియామక కేసు ముఖ్యమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. విచారణను వాయిదా వేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక ప్యానల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023లో ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై బుధవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేసు విచారణను వాయిదా వేయాలని కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. శబరిమల కేసులో బిజీగా ఉన్నట్టు చెప్పారు. దీనిపై స్పందించిన జస్టిస్ దీపాంకర్ దత్తా దేశంలోని ప్రతీ కేసు కీలకమైందేనని వ్యాఖ్యానించారు. శబరిమల కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణకు సమయం కేటాయిస్తున్నపుడు రాజ్యాంగబద్దంగా అత్యంత కీలకమైన ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియకు సంబంధించిన కేసు కూడా అంతే ప్రాధాన్యతమైందన్నారు.
Also Read: ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి గ్రీన్ సిగ్నల్.. ఫలించిన మంత్రి తుమ్మల కృషి!
ఎన్నికల కమిషన్ సమగ్రతను కాపాడటం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమని చెప్పారు. విచారణను వాయిదా వేసేది లేదని స్పష్టం చేశారు. 2023లో తెచ్చిన చట్టం ప్రకారం ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చటం కమిషన్ స్వతంత్రతను దెబ్బ తీస్తుందన్న పిటిషనర్ల వాదనపై తక్షణమే వాదనలు వినిపించాలని ఆదేశించారు.
Also Read: Mitchell Starc : నిద్రపోయిన అంపైర్..అతిపెద్ద నో-బాల్ వేసిన మిచెల్ స్టార్క్