Swechcha Effect: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్ మండల కేంద్రంలో గల శ్మశాన వాటికలో నీటి ఎద్దడిపై ‘స్వేచ్ఛ’ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు, పాలకవర్గం తక్షణమే స్పందించారు. శ్మశాన వాటికలో కనీస నీటి సౌకర్యం లేక, చివరికి అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవడానికి కూడా చుక్క నీరు దొరకని దుస్థితిపై ‘స్వేచ్ఛ’ పత్రిక “మంత్రి ఇలాకాలో మరణయాతన!” అనే శీర్షికతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ వార్త స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. ‘స్వేచ్ఛ’ పత్రిక ఎఫెక్ట్తో నిద్ర లేచిన సైదాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తక్షణమే రంగంలోకి దిగింది.
గ్రామ సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, పంచాయతీ సిబ్బందితో కలిసి శ్మశాన వాటిక వద్ద గతంలో వేసిన బోరు బావికి ఈ రోజు యుద్ధప్రాతిపదికన కొత్త మోటారును బిగింపజేశారు. నీటి సరఫరాను పునరుద్ధరించి, శ్మశాన వాటికకు వచ్చే ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
Also read: రేవంత్ చర్చ సవాల్కు కిషన్రెడ్డి సై! ఎవరేం చేశారో తేల్చుకుందాం రా! బీఆరెస్ ప్రేక్షకపాత్ర!
గత కొంతకాలంగా తాము పడుతున్న ఇబ్బందులను, ముఖ్యంగా అంత్యక్రియల సమయంలో నీటి కోసం పడరాని పాట్లు పడుతున్న వైనాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ‘స్వేచ్ఛ’ పత్రిక యాజమాన్యానికి, రిపోర్టర్కు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్త ప్రచురితమైన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన సర్పంచ్కు, పంచాయతీ పాలకవర్గానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఇక్కడ శాశ్వత వాటర్ ట్యాంకును కూడా నిర్మించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also read: బీఆరెస్పై ఫ్రీ బస్సు సెంటిమెంట్! మహిళలకు మేలు చేసే పథకంపై కుట్రలా!?