Huzurabad: స్వేచ్చ బ్యూరో: హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నుతున్నారు. కళాశాల పరిధిలోని క్రీడా మైదానాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
కళాశాల ఆవరణలో విద్యార్థులు, సిబ్బంది లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ఈ కుట్రకు తెరలేపారు. గత మూడు రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు రాత్రికి రాత్రే జేసీబీ సహాయంతో క్రీడా మైదానాన్ని చదును చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ అక్రమ చొరబాటుకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది.
Also Read: నాటి బతుకమ్మ చీరలతో.. అడవి పందులు తోలేవారు.. బీఆర్ఎస్పై సీఎం రేవంత్ సెటైర్లు
ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ వి. ఆంజనేయరావు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఆయన హెచ్చరించారు. కళాశాల భూమిని ఎవరు ఆక్రమించడానికి ప్రయత్నించినా సహించేది లేదని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
క్రీడా మైదానంలో జరిగిన అక్రమ చదును ఉదంతంపై ప్రిన్సిపాల్ ఆంజనేయరావు తక్షణమే స్పందించారు. ఈ పూర్తి ఉదంతాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, జిల్లా కలెక్టర్కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు.