Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్: హుజురాబాద్ కార్మిక శాఖ కార్యాలయంలో రాజ్యమేలుతున్న ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం, అక్రమ వసూళ్లపై ‘స్వేచ్ఛ’ దినపత్రికలో ప్రచురితమైన సంచలన కథనం జిల్లా అధికార యంత్రాంగంలో పెను ప్రకంపనలు సృష్టించింది. “కార్మిక శాఖలో ప్రైవేట్ రాజ్యం.. అనామకుడి చేతిలో అధికారిక రహస్యాలు” అంటూ వెలుగులోకి తెచ్చిన కథనానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వెనువెంటనే స్పందించారు. అక్షరానికి దక్కిన ఫలితంగా మంగళవారం జిల్లా లేబర్ కమిషనర్ (DCL) ప్రసాద్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (ACL) వెంకటరమణలు సంయుక్తంగా హుజురాబాద్లోని సహాయ కార్మిక అధికారి (ALO) చందన కార్యాలయాన్ని సందర్శించి సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, పత్రికలో వచ్చిన కథనంపై ఆరా తీశారు. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్యమైన లాగిన్ ఐడిలు, పాస్వర్డ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని, దీని వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో సిబ్బందిని కడిగిపారేశారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను ప్రైవేట్ వ్యక్తులు ఆపరేట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులైన వారికి తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ALO చందనను ఆదేశించారు. కార్యాలయంలో పేరుకుపోయిన ఫైళ్లు, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు మరియు కొత్త లేబర్ కార్డుల మంజూరు అంశంపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు.
పేద కార్మికులకు అందాల్సిన క్లెయిమ్లు నెలల తరబడి ఎందుకు ఆగిపోయాయని ప్రశ్నిస్తూ, ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో ఉండటానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పారు. ఈ రోజు నుండే పది రోజులలోగా పెండింగ్లో ఉన్న అన్ని క్లెయిమ్లను మరియు కొత్త కార్డుల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి నివేదిక సమర్పించాలని డెడ్ లైన్ విధించారు. కార్యాలయ పనితీరుపై పర్యవేక్షణ పెంచుతామని, ఇకపై ప్రతిరోజూ ఉదయం 10 గంటలకే కార్యాలయాన్ని తెరిచి సిబ్బంది అంతా విధిగా అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయంలోకి అనధికార వ్యక్తులను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. ‘స్వేచ్ఛ’ పత్రికలో వచ్చిన ఈ కథనం కార్మిక శాఖలో నెలకొన్న అవినీతి పుట్టను కదిలించడమే కాకుండా, బాధ్యులైన వారిలో వణుకు పుట్టించింది.
Also Read: KTR: ముఖ్యమంత్రిపై సీబీఐ, ఈడీ విచారణకు సుప్రీం ఆదేశాలు.. అందుకే మాపై కక్షసాధింపులు: కేటీఆర్ ధ్వజం